calender_icon.png 27 June, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ జూదాలతో అనర్థాలు

05-12-2024 12:00:00 AM

దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న దుర్లక్షణాలలో ఒకటైన ఆన్‌లైన్ జూదాలు సంక్షోభ స్థాయికి చేరుకున్నా యి. ఈ బెట్టింగ్, జూద క్రీడలు జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా వ్యాపించా యి. వీటిని నిర్వహించే పలు కంపెనీలకు అనేక సందర్భాలలో చైనానుంచి పెట్టుబడులు అందుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులోని నిజానిజాలను తేల్చి వాటిని అరికట్టే దిశగా చర్యలు జరగాలి. దేశంలో సంస్కరణలకు తలుపులు తెరచుకున్న కాలం నుంచీ ఒక భరింపరాని జాఢ్యంగా పరిణమించిన విదేశీ నిధుల వ్యసనం ఇలా తప్పుడు మార్గంలోకి మళ్లుతుండడం దేశాభివృద్ధిని కాంక్షించే ప్రగతి కాముకులలో ఆందోళన కలిగిస్తున్నది.

ఆన్‌లైన్ జూదాలు పచ్చని సంసారాలను కూల్చడమే కాక ఆయా సంక్లిష్టదశల లో బాధితుల ప్రాణాలను సైతం కబళిస్తున్నాయి. ఇటీవల ఒక యువజంట విడిపో వడానికి కారణం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ అంటే మనం నమ్మగలమా! ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తన భర్త ఆన్‌లైన్ జూదానికి బాగా అలవాటు పడ్డాడని, విధి లేక తాను విడాకులకు దరఖాస్తు చేశానని ఆ నిర్భాగ్యురాలు వెల్లడించింది. గత రెండేళ్లలో అతడు తన డబ్బులోంచి సుమారు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేసి, ఆపై ఆమె ఖాతానుంచి కూడా కొన్ని లక్షలు తస్కరించేశాడట.

‘తక్కువ కాలంలో, శ్రమ లేకుండా నిచ్చెన మెట్లు ఎక్కిన చందం’గా డబ్బు సంపాదించవచ్చుననే అత్యాశకు లోనైన ఫలితంగా అనేకమంది ఆన్‌లైన్ బెట్టింగులకు, గేమింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరు పోలీసులకు పట్టుబడు తున్నారు కూడా. అమాయకులు బలై పోతూ, వీటికి కారణమైన అసలు నేరస్తులు తప్పించుకుంటున్నారు. బాధితులు పరువు ప్రతిష్టలకు పోతుంటే, మోసగాళ్లు పేట్రేగుతున్నారు.

వీరిని పట్టుకొని కోర్టుల వరకూ తీసుకెళ్లడం ఒక ఎత్తయితే, నేరాలు రుజువై శిక్షలు పడుతున్న దాఖలాలు అస్సలు కనిపించడం లేదు. ఈ ఆన్‌లైన్ జూదాలలో మధ్యతరగతి యువకులు ఒక్కొక్కరు కనీసం రూ.80 లక్షల వర కు కూడా పోగొట్టుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఈ కూపంలోంచి బయట పడలేక, తమ భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లడంతో వారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ పెను సంక్షోభం గ్రామాలు, పట్టణాలకూ పాకింది. అమాయక ప్రజలకేకాక చదువుకుంటున్న యువత సైతం ఈ దురలవాటు ప్రభావానికి లోనవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. 

వేల కోట్లకు అక్రమ వ్యాపారం

భారతదేశంలో జాతీయస్థాయిలో ఒక్క ‘ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్’ ఒక అంచనా మేరకు ఏటా రూ.25,000 కోట్లుగా ఉన్న ట్టు అంచనా. ఇక, ‘ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ’ మార్కెట్ అయితే దాదాపు అంతే తీవ్రస్థాయిలో విస్తరించింది. అటు ఆన్‌లైన్ బెట్టింగ్, ఇటు గేమింగ్‌ల కోసం ప్రతి సంవత్సరం వ్యయమవుతున్న మొత్తం సగ టు సొమ్ము సుమారు 50,000 కోట్లు ఉంటున్నట్టు అంచనా. నమ్మక తప్పని నిజమేమింటే, ఇది భారతదేశం మొత్తం ‘ఉన్న త విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ’.

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను మనం మూడు విధాలుగా చూడవచ్చు. మొదటిది: ఆన్‌లైన్ ‘కాసినో’ (జూదగృహం లేదా వినోద కేంద్రం). ఇక్కడ నిజ జీవిత కాసినోల వలె జూదం కార్డ్స్‌ను ఉపయోగించి ఆడవచ్చు. కాకపోతే, మన మొబైల్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటినుంచే ఈ ఆన్‌లై న్ జూదాలూ ఆడవచ్చు. రెండవ రకంలో ‘ఫాంటసీ లీగ్’ గేమ్స్‌కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు క్రికెట్, ఫుట్‌బాల్ తదితర ప్రసిద్ధ క్రీడల ఫలితాలపై ‘పందెం’ వేయడం (బెట్టింగ్) జరుగుతుంటుంది.

మూడవ రకం: వినియోగదారులు తమలో తాము పందెం వేసుకోగల సాధారణ ఆన్‌లైన్ గేమ్స్. ఈ వర్గంలో, లూడో, పాములు, నిచ్చెనలు, పూల్, తీన్ పత్తీ వంటి సాధారణ గేమ్స్ బెట్టింగ్ కోణాన్ని పరిచయం చేయడం ద్వారా మానిటైజ్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ఈ ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ (జూదాలు) ఇంత భారీ ఎత్తున పెరగడానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలను తెలుసుకోగలిగితే వాటి నిర్మూలన దిశగా ఆలోచించవచ్చు. 

చట్టం, శిక్ష కఠినంగా ఉండాలి

ముందుగా ఆన్‌లైన్ జూదంలో, ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్న స్మోక్స్ స్క్రీన్ వెనుక తన గుర్తింపును దాచవచ్చు. ఆడేవారు వేర్వేరు పేర్లనుకూడా ఉపయోగించవచ్చు. ముఖంతోపాటు ప్రదేశాన్నీ దాచుకోవచ్చునని అంటున్నారు. ఆన్‌లైన్ జూదం నిర్వ హించే కంపెనీలు తమ భ్రమలతో ప్రజలను చాలా వ్యవస్థీకృతంగా, నైపుణ్యంతో ఆకర్షిస్తాయి. ఇది ఏ క్యాసినో చేయదు. గృహిణులు, కళాశాలకు వెళ్లే యువత ‘తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన’కు ఆశపడి, మోసపోయి బెట్టిం గ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.

మరోవైపు ఆన్‌లైన్ జూదాల (బెట్టింగ్స్, గేమిం గ్స్) నివారణ, నిర్మూలనకు ఉపయోగపడవలసిన చట్టం బలహీనంగా ఉండటమే కాకుండా అస్పష్టంగానూ ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. భారతదేశంలో జూ దాన్ని నియంత్రించే చట్టం ‘పబ్లిక్ గ్యాంబ్లిం గ్ యాక్ట్’ 1867 కాలం నాటిది. దీని ప్రకారం, పోలీసులు, పరిపాలనా అధికారులు జూదంలో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ, ఈ చట్టంలో ‘జూదం’ అనే మాటకు నిర్వచనమే గందరగోళంగా ఉంది. ఇది ‘గేమ్ ఆఫ్ స్కిల్’, ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’ని విభిన్నంగా పరిగణిస్తుంది. 

నైపుణ్య సంబంధ ఆటలలో వ్యూహం, మానసిక సామర్థ్యాన్ని ఉపయోగించే చదరంగం వంటి ఆటలు ఉంటాయి. వీటికి విరుద్ధంగా, పూర్తిగా అదృష్టంపై ఆధారపడిన పాచికలు లేదా లాటరీలను ఉపయో గించే గేమ్స్‌ను ‘అవకాశాల ఆటలు’ అం టారు. అదృష్టం, నైపుణ్యం మధ్య ఈ రేఖ అస్పష్టంగా ఉంది. ఆన్‌లైన్ యుగంలో ఈ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. చట్టంలోని ఈ సందిగ్ధతను ఉపయోగించుకుని ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ (జూదం) లు భారతదేశంలో వేగంగా వ్యాపించాయి.

ఇవి ‘నైపుణ్య క్రీడలవలె’ ప్రచారంలోకి వచ్చాయి. అనేక సందర్భాల్లో, సదరు కంపెనీలకు చైనా దేశీయ పెట్టుబడులు మద్దతునిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ రకమైన మార్గంలోకి వచ్చి చేరుతున్న విదేశీ నిధుల వ్యసనం మొత్తం దేశాన్ని పట్టి పీడిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

సత్సంకల్పంతోనే పరిష్కారం

జూదాలను నియంత్రించే చట్టాలను నేటి ఆన్‌లైన్ ల్యాండ్ స్కేప్‌కు అనుగుణం గా మార్చుకోవాలి. వ్యక్తిగత నైపుణ్యాలు, సామర్థ్యాలపై పూర్తిగా ఆధారపడి ఉంటే తప్ప -దీనిని ఒక ‘అవకాశ క్రీడ’గా పరిగణిం చి, తదనుగుణంగా వ్యవహరించాలి. అలాకాక, వట్టి ‘అదృష్టం’ ఆధారంగా నిర్వహిం చే ఆటలను అవి ఎలాంటివైనా నిర్మూలించాలి. అదృష్టం పేరుతో జరిగే మోసాల్ని ప్రజలకు తెలియజేయాలి. పిల్లలను, టీనే జ్ యువతను ఆన్‌లైన్ బెట్టింగ్స్‌కు దూరం గా ఉంచాలి.

పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించ డం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ గేమ్స్ వినోదాన్ని ఇవ్వగలవేమో కానీ ఆదాయాన్ని కాదన్న స్పృహను సమాజంలో పెంపొందింప జేయాలి. చివరగా, ప్రభుత్వాలు ఇంతవరకు ఈ సమస్యను తగిన శ్రద్ధతో, కఠినంగా తీసుకోలేదు. కొన్ని చట్టబద్ధమైన ఆన్‌లైన్ గేమింగ్స్‌తో వచ్చే ఆదాయంపై ప్రభుత్వం పన్నులు విధించింది. తద్వారా దానిని చట్టబద్ధం చేసే మార్గాన్ని అందిస్తున్నట్టయింది. ప్రజల బలహీనతలపై భయంకర ప్రభావాన్ని చూపుతున్న ఈ ఆన్‌లైన్ జూదాలను ఇప్పటికైనా అరికట్టడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకోవాలి.

- గడీల ఛత్రపతి