11-08-2025 06:12:38 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు..
బిచ్కుంద (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు అని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Laxmi Kantha Rao) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్పగల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు, మౌళిక సదుపాయాల గురించి ప్రిన్సిపాల్, సిబ్బందితో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
దీనిలో భాగంగా విద్యార్థులపై ఖర్చు పెట్టే ప్రతి పైసా అది ఖర్చు కాదు రేపటి బంగారు తెలంగాణకు పెట్టుబడి లాంటిదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు రాష్ట్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. అలాగే విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టాలని ఉద్దేశ్యంతో విద్యా కమీషన్ ఏర్పాటు, అంగన్వాడీలను ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చడం, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు 40% కాస్మోటిక్ చార్జీలు 200% పెంచడం జరిగిందని వివరించారు.
కేవలం వసతులు కల్పించడమే కాదు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని అన్నారు, పారదర్శకంగా టీచర్స్ బదిలీలను కూడా నిర్వహించి విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. గతంలో చాలిచాలని బడ్జెట్ తో విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన భోజనం అందించ లేదని, అరటి పండు ఇస్తే, గుడ్డు ఇవ్వలేదు, గుడ్డు ఇస్తే ,పాలు ఇవ్వలేదు ఇలా ఎదో ఒక రకంగా మెనులో కోత విధించేవారని అన్నారు. ఇవ్వన్నీ గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకలి కడుపుతో విద్యార్థుల ఎదుగుదలకు చదువుకు నష్టం వాటిల్లుతుందని, గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు.