మియాపూర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
పోలీసులపై దాడికి పాల్పడ్డ 21 మంది అరెస్ట్
అవసరమైతే పీడీయాక్ట్ పెట్టే యోచన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): మియాపూర్ దీప్తీ శ్రీనగర్ మదీనాగూడలోనిహెచ్ఎండీఏ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వారిపై ప్రభుత్వం సీరియస్ అయింది. పేదల ముసుగులో పోలీసులపై దాడికి దిగిన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగించాలని యోచిస్తోంది. వారి వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
144 సెక్షన్ విధింపు
మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములను ఆక్రమించుకునేందుకు కొంతమంది పేదలు ప్రయత్నించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మియాపూర్లో హైడ్రామా నెలకొంది. పోలీసులు, ఆక్రమణదారుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులపై మహిళలు, ఆక్రమణదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెచ్ఎండీ అధికారి రఘుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం పోలీసు బలగాలను భారీగా మోహరించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి దీప్తి నగర్ మదీనాగూడలోని సర్వేనంబర్ 100, 101 భూములను సందర్శించారు.
మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలెవరూ ఈ భూముల్లోకి రావొద్దని, వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పోలీసులపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, దాడులకు తెగపడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, సంఘటనా స్థలంలో మాదాపూర్ డీసీపీ వినీత్, అడిషనల్ డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల హెచ్చరికతో పలువురు అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొంత మందిని ఖాళీ చేయిస్తున్నారు.
ఏమిటీ వివాదం?
మియాపూర్లోని మదీనాగూడలో హెచ్ఎండీఏకు దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో ఇప్పటికే దాదాపు 50 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఇదే భూమిలో పలువురు ప్రైవేటు వ్యక్తులు ప్లాట్లు కొన్నామని హైకోర్టులో కేసు వేయగా.. ఆ స్థలం ప్రభుత్వానిదేనని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆ వ్యక్తులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం నడుస్తుండగా.. గత కొన్ని రోజులుగా ఆ భూములను ఆక్రమించడానికి పలువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు స్థలాలు ఇస్తున్నట్లు ప్రచారం జరగడంతో శనివారం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆ స్థలంలో రాత్రికి రాత్రే ఓ గుడిని కట్టారు. పరిస్థితిని గమనించిన అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పడంతో ప్రజలు వారిపై తిరగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
రాళ్లు రువ్విన 21 మంది అరెస్ట్
మియాపూర్ హెచ్ఎండీఏ భూముల ఆక్రమణను అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 21 మందిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఆదివారం రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ నర్సింహారావుతో కలిసి అరెస్టుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనలో 50 మందిని గుర్తించామని, వారిలో 21 మందిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్టున వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్ 307, 333, 447, 147, 148, 120బి, రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.






