30-05-2025 01:13:06 AM
నిజామాబాద్, మే 29 (విజయ క్రాంతి): తొలితరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కార్యకర్త పెద్ద శంకరయ్య అమరత్వం వెలలేనిదని నిజమాబాద్ బార్ అస్సోసియేషన్ అధ్యక్షుడు మామిల్ల సాయరెడ్డి అన్నారు.
బి.ఆర్ అంబేద్కర్ దళిత బహుజన సంగం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సామాజిక సంస్కర్తల విగ్రహాల ప్రాగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర తొలితరం అమరవీరుడు పెద్ద శంకరయ్య వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహానికి పులాంక్రుతులను చేసి ప్రధానోపన్యాసం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం 1969 లో పోలీసు కాల్పుల్లో హైదరాబాద్ లోని అపజల్ గంజ్ ప్రాంతంలో ప్రాణాలు విడిచిన శంకరయ్య ఎందరో తెలంగాణ పోరాట యోధులకు ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని ఆయన తెలిపారు. దళిత కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఆయన ఉద్యమస్ఫూర్తి, తెలంగాణ భావజాలం మలిదశ ఉద్యమానికి ప్రేరక శక్తిగా ప్రేరణ కలిగించిందని అన్నారు.
శంకరయ్య అమరుడు అయిన అనంతరం ఆయన కుటుంబం మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాకు వలసవచ్చి ఎడపల్లి మండలం నెహ్రు నగర్ లో స్థిర పడ్డదని గుర్తు చేశారు.తెలంగాణ మలిదశ ఉద్యమ సమయాలలో నాటి ఉద్యమసారతి కేసీఆర్ ఎన్నోసార్లు శంకరయ్య కుటుంబ సభ్యులను పరమార్శించిన చరిత్రాత్మ సందర్భాలను తెలియజేశారు.
తెలంగాణ అమరవీరుల విగ్రహాలు వాటి చరిత్రను, స్ఫూర్తిని సమాజానికి తెలియజేస్తాయని, జయంతులు, వర్ధంతులు నిర్వహించుకోవడమంటే చరిత్రను మరోమారు అధ్యయనం చేయడమేనని సాయరెడ్డి తెలిపారు.శంకరయ్య మనుమడు పాలమూరి జ్యోతిరాజ్ కూడా మలిదశ ఉద్యమంలో తనవంతు పాత్ర నిర్వహించి తాత అడుగు జాడలలో నడిచారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలను అక్కున చేర్చుకుని ఆదుకోవలసిన అవష్యకత ఉన్నదని ఆయన అన్నారు. బార్ ఉపాధ్యక్షుడు దిలీప్ మాట్లాడుతు శంకరయ్య అమరత్వం అజరామరమని అన్నారు.
దళిత బహుజన సంగం అధ్యక్షుడు పాలమూరి జ్యోతిరాజ్ అధ్యక్షతన కార్యక్రమంలో న్యాయవాదులు ఆశ నారాయణ, అన్వేష్, అరేటి నారాయణ,బార్ లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్,బోధన్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శేఖర్ రాజ్, రాధాకృష్ణ గౌడ్, భాస్కర్ గౌడ్,తెలంగాణ అమరవీరుల కటుంబ సభ్యుల వేదిక సభ్యులు పాల్గొన్నారు.