03-06-2025 08:55:02 PM
కొండపాక: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో విత్తుకొద్దీపంట అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా మండలంలోని 11 రెవిన్యూ గ్రామాలలో గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున ఎంపిక చేసి వారికి ప్రభుత్వం ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయంచే పూర్తి సబ్సిడీతో నాణ్యమైన మూల విత్తనాలను అందించడం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
దీనిలో భాగంగా మంగళవారం మండలంలోని దుద్దెడ రైతు వేదికలో ఎంపిక చేయబడిన రైతులకి వ్యవసాయ శాస్త్రవేత్త డా.శుభాన్శు సుధాకర్ ద్వారా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము విత్తనాల ప్రాముఖ్యత పాటించవలసిన మెలుకువలు గురించి రైతులకు వివరించారు. 22 సిద్ది సన్నరకం వరి(10కిలోల), 11 ఎంజిజి 385 పెసర(2కిలోల) విత్తనాల సంచులనుఎంపిక చేయబడిన రైతులకు అందించారు.కార్యక్రమంలో ఏఎంసి కొండపాక వైస్ చైర్మన్ పరుశరాములు, మండల వ్యవసాయ అధికారి శివరామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రనూష, రమ్యశ్రీ, మౌనిక, సుస్మిత రైతులు పాల్గొన్నారు.