17-06-2025 11:02:38 PM
నిష్పక్షపాతంగా విచారణ చేసి తుది నివేదిక అందిస్తాం..
డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం..
పెన్ పహాడ్: మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెచ్ఈఓ చంద్రశేఖర్ రాజు కలిసి వైద్య సిబ్బందిపై చేస్తున్న వేదింపులు, జాస్ నిధులు స్వంత అకౌంట్కు మార్చుకొని దుర్వినియోగం చేశారన్న ఆరోపనులపై స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar), డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్(DMHO Dr. Chandrasekhar) విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ అధికారి, డిప్యూటీ డిఎంహెచ్ఓ కోటిరత్నం మూడు రోజుల పాటు తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. అలాగే వైద్యాధికారి చెప్పిన విధంగా ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని ఇరు వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాధులకు సంబంధించిన పూర్తి విషయాలపైన ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు.
మేడం ప్లీజ్..ప్లీజ్..?
విచారణ తదనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ సహా విచారణ అధికారిని మండల వైద్యాధికారి స్రవంతి మేడం ప్లీజ్.. ప్లీజ్ అంటూ దీనంగా అడగటంతో.. సదరు అధికారి ఆగి ఏంటమ్మా.. చెప్పమ్మా అనడంతో మీతో కొద్ది సేపు మాట్లాడలని వేడుకుంది. హాల్లో మాట్లాడుతుండగా ఇక్కడ కాదు మేడం.. అంటూ పక్కనే ఇంజక్షన్ రూంలోకి తీసుకెళ్ళిన తదుపరి వారి ఇరువురు గుసగుస లాడుకున్నట్లు సిబ్బంది ద్వారా తెలిసింది. ఆ ఇద్దరు మేడంలు ఏం మాట్లాడుకున్నారని.. రేపు విచారణ పక్కదోవ పడుతుందేమోననే చర్చలు సిబ్బంది మధ్య జరిగినట్టు తెలుస్తుంది.
ఆరా తీయక పోవడంలో ఆంతర్యమేమిటి...?
విచారణ జరుగుతుందన్న విషయం తెలియగానే హెచ్ఈఓ చంద్రశేఖర్ రాజు తీర్మాణాలు చేయకుండానే ఫర్నీచర్ కొనుగోలు చేసినట్లు రసీదులు తీసుకువచ్చి సంబందిత ఎం ఎల్ హెచ్ పీల చేత విచారణ అధికారినికి అందజేయించారని తెలుస్తుంది. అదీ కేవలం అనాజీపురం, చీదెళ్ల, లింగాల, భక్తళాపురంలో పల్లె దవాఖానాలో సంబందించిన ఎం ఎల్ హెచ్ పీల ద్వారా తీర్మాణాలు, రశీదులు కలిపి విచారణ అధికారినికి అందజేశారు.
మిగితా ఏఎన్ఎంలు ఉన్న పల్లె దవాఖానాలకు సంబందించి జాస్ నిధుల లెక్కలపై విచారించక పోవడంలో ఆంతర్యమేమిటని ఏఎన్ఎంలు భాహటంగానే అంటుండడం గమనించదగ్గ విషయం. అదేవిధంగా అనంతారం, అన్నారం, మరో కొన్ని పల్లె దవాఖానాలకు బాధ్యులు లేకున్నా నిధులు డ్రా ఎలా అయ్యాయని..ఎవరు చేశారని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే ఆయా షాపులకు సంబందించి రశీదులు, ఇచ్చిన తేదీ, కొనుగోలు చేసిన తేదీ, ఫర్నీచర్ వచ్చిన తేదీలపై పూర్తిగా సమాలోచనలు చేస్తే వీళ్ళ అసలు రంగు బట్టబయలు అవుతుందని అభిప్రాయాలు స్థానికుల నుండి వ్యక్తమవుతున్నాయి.