17-06-2025 11:06:10 PM
ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నెల్లికంటి సత్యం..
హయత్నగర్లో ఘనంగా సీపీఐ మండల మహాసభలు..
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్..
ఎల్బీనగర్: ‘ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే మార్గం.. ఆ మార్గంలో నిబద్ధతగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ’ అని ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నెల్లికంటి సత్యం(CPI State Secretary Member Nellikanti Satyam) అన్నారు. మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) హయత్నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ మండల మహాసభను స్థానికంగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ మహాసభకు సీపీఐ మండల సహాయ కార్యదర్శి మర్రి శోభన్, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథులుగా నెల్లికంటి సత్యం, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రచారి, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాసభను ప్రారంభించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. భూ పోరాటాల్లో భాగంగా వేలాది మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలు, భూములపై హక్కులు కల్పించిన ఘనత సీపీఐకే దక్కుతుందని గుర్తు చేశారు.
వందేండ్ల చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వాడ వాడలా వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సభలో సీపీఐ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ ఆటపాటలతో అలరించారు. ఈ మహాసభలో మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి, సహాయ కార్యదర్శి బొంగు అరుణ్ కుమార్ గౌడ్, మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్, ఏఐవైఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు పోలోజు లక్ష్మణ్, వివిధ శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మావోయిస్టులతో చర్చలు జరపాలి
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా అమాయక ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరిట చంపేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు.