06-06-2025 12:19:11 AM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జూన్ 5 ( విజయక్రాంతి ) : జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధి లో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు పెండింగ్ ఆయకట్టు భూ సేకరణ పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.రైతులు పంట సాగు ప్రారంభించే ముందే భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. వచ్చే రెండు వారాల్లోగా ఫీల్ సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పురోగతిని ప్రతి వారం నివేదిక సమర్పించాలని సూచించారు.
భూసేకరణ ప్రక్రియలో ఇప్పటికే అవార్డుల దశకు చేరుకున్న వాటిని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. రైతులను ఒప్పించి భూసేకరణ ప్రక్రియను నిర్ధిష్ట గడువులో పూర్తి చేయాలని అన్నారు.క్షేత్ర స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
సర్వే చేసేందుకు సర్వే ల్యాండ్, ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, అధికారులు పాల్గొన్నారు.