రేవంత్రెడ్డిపై విషప్రచారం మానుకోవాలి
కాంగ్రెస్ నాయకులు
కోదాడ, జాన్ 30 : నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అసత్య ప్రచారాలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ లు మండిపడ్డారు. మంగళవారం కోదాడ పట్టణంలో సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. తన హయాంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియాలకు అండగా నిలిచి కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే ముందు, తన పాలనలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, పోలీసు శాఖ అధికారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.
దళిత బంధు పథకం అమలులో లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ ఆరోపణలు అబద్ధమైతే బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. వైన్ షాపుల కేటాయింపుల్లో బినామీలను రంగంలోకి దింపి, పెట్టుబడి పెట్టకుండానే సిండికేట్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలతో రాజకీయాలు చేసే బీఆర్ఎస్కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.






