22-03-2025 12:00:00 AM
జనగామ, మార్చి 21(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పో రాటం, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో జనగామ ప్రాంతం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆనాడు తాలుకాగా, ఆ తరువాత నియోజకవర్గం కేంద్రంగా, తదుపరి జిల్లాగా ఉద్భవించిందించి జనగామ. ఈ పేరుకు ఎంతో చారిత్రక నేపథ్యముంది. బ్రిటీష్ కాలంలోనే రైల్వే కేంద్రంగా ఉండడంతో జైనులు నడయాడిన ప్రాంతంగా విలసిల్లింది.
ఎక్కువగా జైనులు ఉండడంతో ఈ ప్రాంతానికి జైనగ్రామంగా పేరు వచ్చింది. ఆ తరువాత వాడుకలో జనగామగా మారినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమేనా నియోజకవర్గంగా, జిల్లాగా ‘జనగామ’ విలసిల్లుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే మొదటగా గుర్తొచ్చేది జనగామ పేరే.. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం క్రియాశీలకంగా వ్యవహరించింది. దీంతో జనగామ అనే పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది.
అయితే.. ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన ఈ గడ్డపై ఇప్పుడు కొత్త ఉద్యమం తెరపైకి వస్తోంది. ఈ గడ్డపై పుట్టిన మహనీయుల పేర్లను జిల్లాకు పెట్టాలంటూ పలు కుల సంఘాలు ఉద్యగాన్ని నెత్తికొత్తుకున్నాయి. ఇందులో గౌడ కుల సంఘం ముందంజంలో ఉంది. సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరును జిల్లాకు పెట్టాలని గౌడ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి.
తాజాగా ఈ నెల 21న శుక్రవారం కలెక్టరేట్ ఎదుట గౌడ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జనగామ జిల్లా పేరును మార్చి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు నామకరణం చేయాలని ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చారు. మరోవైపు చారిత్రక నేపథ్యం కలిగిన జనగామ పేరును మారిస్తే ఊరుకోబోమని జిల్లా జేఏసీ పోటీగా నిరసనలు తెలుపుతోంది.
గౌడ సంఘాల పోరాటానికి పోటీగా ఇప్పటికే జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడంతో పాటు శుక్రవారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో జనగామ స్ఫూర్తి స్తూపానికి నల్ల కండువాలతో పాలాభిషేకం చేశారు. ఇంతకుముందే సీఎం రేవంత్రెడ్డి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్పేరును పెడుతున్నట్లు ప్రకటించేశారు. దీంతో గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేయగా..
పలు సంఘాలు వ్యతిరేకించాయి. జనగామకు తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, నల్లా నర్సింహులు పేర్లు ప్రకటించాలని రజక సంఘం, కురుమ సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసలు తెలిపారు. సాయుధ పోరాటంలో ముందుండి పో రాడిన ఠానునాయక్ పేరు పెట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో జనగామ జిల్లాలో పేరు మార్పు కొత్త రగడ రాజుకుంటోంది.
పేరు మార్చకుంటే ఊరుకోం: గౌడ అనుబంధ సంఘాలు
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణం చేయాలని తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ వేదిక నాయకులు శుక్రవారం జనగామ కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపట్టారు. గౌడ జేఏసీ సమన్వయకర్త కన్నా పరుశరాములు అధ్యక్షతన చేపట్టిన ఈ దీక్షలకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివచ్చారు.
ఈ సందర్భంగా అంబాల నారాయణ గౌడ్, వంగ సదానందం గౌడ్, పంజాల జైహింద్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. అనేక సంస్థానాలను, కోటలను వశం చేసుకుని పాలన సాగించిన బహుజన వీరుడు సర్దార్ పాపన్నగౌడ్ జనగామ జిల్లాలో పుట్టారని, ఆయన పేరు జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు.
పేరు మార్చితే మరో ఉద్యమం
జనగామ జిల్లా పేరు మార్చితే మరో పోరాటానికి సిద్ధమని జిల్లా జేఏసీ హెచ్చరించింది. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో గల ఉద్యమ స్ఫూర్తి స్థూపం వద్ద జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన నాయకులు సమావేశమయ్యారు. జన గామ జిల్లా పేరు మార్చొద్దంటూ తీర్మానించారు. గౌడ సంఘాలు చేస్తున్న డిమాండ్కు వ్యతిరేకంగా నల్ల కండువాలు ధరించి జిల్లా స్పూర్తి స్థూపం(జైన స్థూపం)కు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భగా జేఏసీ నాయకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. జనగామ జిల్లా పేరుకు ఒకరి పేర పెడితే మిగతా మహనీయులను అవమానపరచడమేనన్నారు. చారిత్రక నేపథ్యమున్న జనగా మ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిగారి రాజు, గండి నాగరాజు, ఆకుల సతీష్, పిట్టల సురేష్, గంగా భవాని, మీసాల వెంకన్న, గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.