మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ
మూడుతండాలో భక్తి శ్రద్ధలతో మొహర్రం ఉత్సవాలు
టేకులపల్లి, జూన్ 26,(విజయక్రాంతి): కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఒకచోట చేర్చి సోదర భావాన్ని పెంపొందించే (మొహర్రం) పీర్ల పండుగ మూడుతండా గ్రామంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మూడు తండా గ్రామంలో శుక్రవారం మొహరం సందర్భంగా పీర్ల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీరీ లను గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు మొక్కులు చెల్లించు కొని తమ కుటుంబాల సుఖసంతోషాలు, గ్రామ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
హిందూ, ముస్లిం సోదరులు కలిసి నిర్వహించిన ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. కార్యక్రమంలో మూడ్ హుస్సేన్ నాయక్, మూడ్ రాజ్ కుమార్, నాగేశ్వరరావు, మూడ్ కృష్ణ, మూడ్ గణేష్, సుమన్, సుభాన్, పూజారి ఫౌజా పవన్, మహేష్, దయాకర్, రత్నశేఖర్ తదితరులు పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.






