26-06-2025 12:00:00 AM
సన్నీఅఖిల్, అజయ్ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి బెల్లి జనార్ధన్ నిర్మాత. ఇందులో కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా ఖుషి తదితరులు ఇతర తారాగణంగా ఉన్నారు.
ఈ మూవీ టీజర్ను హీరో సుధీర్బాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ.. “దర్శకుడు బాబ్జీ మా మామ సూపర్స్టార్ కృష్ణకు బాగా దగ్గరివాడు. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ అభిమానులందరికీ సుపరిచితుడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్ను నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ‘పోలీస్ వారి హెచ్చరిక’ ఒక అస్త్రంలా ఆకర్షణీయంగా, రిచ్గా ఉంది” అన్నారు.
“నేను ఏ సినిమా చేసినా ఆ సినిమా తాలూకు ఏదో ఒక కార్యక్రమాన్ని కృష్ణ చేతుల మీదుగా జరుపుకునే వాడిని. సుధీర్బాబు టీజర్ను విడుదల చేయడంతో ఆయన లేని లోటు తీరింది” అని చిత్ర దర్శకుడు బాబ్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు సన్నీఅఖిల్, నిర్మాత బెల్లి జనార్ధన్ పాల్గొన్నారు.