చెక్ డ్యామ్ కూలడానికి నాణ్యత లోపమే కారణం
ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్..
మంథని (విజయక్రాంతి): ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే చెక్ డ్యామ్ కూలిపోయిందని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయంలో 38 కోట్ల 82 లక్షల రూపాయల వ్యయంతో ఆడవి సోమన్ పల్లి దగ్గర మానేరుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అప్పట్లో చెక్ డ్యాం నిర్మాణ పనులపై సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లనే తరచూ వరదల్లో కొట్టుకుపోతున్నాయన్నారు.
మానేరుపై 500 మీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ పనుల్లో సైడ్ వాల్స్ అడుగు భాగంలో గుత్తేదార్లు బైండింగ్ మట్టి పోయకపోవడంతో, చెక్ డ్యామ్లకు ఇరువైపులా కరకట్టలు కట్టకపోవడంతోనే చెక్ డ్యాములు కూలిపోతున్నాయన్నారు. దీనిపై సంబందించి డీఈని అడిగితే ఎవరో బాంబులు పెట్టి పేల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం అసంబద్ధంగా ఉందన్నారు. చెక్ డ్యామ్ గోడ కూలిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి, కొయ్యురు సర్పంచ్ కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.






