04-11-2025 06:36:26 PM
చినుకు పడితే చాలు చిత్తడే చిత్తడే..!
చండూరు (విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి నుండి తిమ్మారెడ్డి గూడెం మట్టి రోడ్డును బిటి రోడ్డుగా మార్చాలని ఇరు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తుమ్మలపల్లి కుంట నుండి తిమ్మారెడ్డి గూడెం పోయే రహదారి వర్షం వస్తే చాలు చిత్తడే.. చిత్తడిగా మారుతుంది. నిత్యం వందలాదిమంది ప్రజలు వాహనాలు, ప్రజలు సంచరించే ఈ రహదారి ప్రస్తుతం గుంతల మయంగా మారి ప్రమాదాల బాటలో నడుస్తుంది. రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో రాత్రి వేళలో వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చాలామందికి గోతులు కనిపించకపోవడం వలన ప్రమాదాలకు బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల కారణంగా మట్టి అంతా కొట్టుకపోయి కంకర రాళ్లు తేలడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత పాలక ప్రభుత్వాలు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని ప్రజాప్రతినిధులు అనేక వాగ్దానాలు చేసి ఈ రోడ్డును మర్చిపోయారని ప్రజలలో విమర్శలు లేకపోలేదు. ఈ రహదారి వెంట రైతులు వారి వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటారు. వాహనదారులు ప్రభుత్వానికి లక్షల రూపాయల పన్నులు చెల్లిస్తున్నారని ప్రజల భద్రత కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డు మరమత్తు పనులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.