02-11-2025 04:59:38 PM
చిన్న తూముకు పడ్డ బుంగ... తెగిపోయే ప్రమాదంలో చెరువు..
అధికారులు స్పందించి తక్షణమే మరమత్తులు చేయాలి..
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి పెద్ద చెరువుకు ప్రమాదం పొంచివుంది. చెరువు వద్ద ఉన్న చిన్న తూముకు బుంగ పడటంతో తెగిపోయే ప్రమాదంలో ఉంది. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే మరమత్తులు చేపట్టాలని పారుపల్లి మాజీ సర్పంచ్ చొప్పరి సరోజన సంపత్, ముత్తారం మాజీ సర్పంచ్ తూటీ రజీతరఫి కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ చెరువుకు బుంగ పడిందని, దీంతో చెరువు కట్టకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు ఆయకట్టు కింద దాదాపు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని, మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోతారని, ఈ బుంగను తక్షణమే పూడ్చి వేయకపోతే పెద్ద ప్రమాదం తప్పదని వారు అధికారులకు సూచిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చెరువుకు పడ్డ బుంగను పూడ్చి ఇటు రైతులను అటు మత్స్యకారులను ఆదుకోవాలని ప్రజలు, మాజీ సర్పంచ్ అధికారులను కోరారు.