calender_icon.png 9 June, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజం నిలకడగా..

03-06-2025 12:00:00 AM

యుద్ధంలో గాయ పడని సైనికుడు ఉండడని అంటారు. యుద్ధంలో సైనికులు గాయ పడతారు, మరణిస్తారు. నిర్దాక్షిణ్యంగా యుద్ధం బీభత్సాన్ని మిగుల్చుతుంది. ఎన్ని యుద్ధ విమానాలు నేలకూలాయి, ఎన్ని యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయి అనే లెక్కపై యుద్ధంలో గెలుపోటముల అంచనా ఉంటుంది. శత్రు దేశపు భూభాగాన్ని ఆక్రమిస్తే అదొక గెలుపు. మిలటరీ ఆపరేషన్స్‌లో కొన్ని ఎదురుదెబ్బలు సర్వసాధారణం.

కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల పాక్ ప్రేరేపిత ఉగ్రమూక టూరిస్టులపై మారణహోమం సాగించింది. అందుకు ప్రతీకారంగా మన దేశం పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేర మన దేశం తీసుకున్న మిలటరీ ఆపరేషన్ విజయవంతమైంది. నిర్దుష్ట లక్ష్యాలను ఎంపిక చేసుకుని ఒక ఖచ్చితత్వంతో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత్ ఆశించిన ఫలితాలను సాధించింది. 

ఈ మినీ యుద్ధంలో భారత్ యుద్ధ విమానాలను ఐదింటిని నేల కూల్చామని పాకిస్థాన్ ప్రచారం చేసుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ కరాచీ పోర్టు సిటీని ధ్వంసం చేసిందని, పాకిస్థాన్ వైమానిక స్థావరాలన్నీ నాశనమయ్యాయని మొదట వార్తలు పుట్టాయి. ఇలాంటి అసత్య వార్తలను భారత్ ఖండించింది. ఉగ్రవాదుల శిబిరాలు నేల మట్టమయ్యాయన్న వార్తలు మన సైనిక దళాల పరాక్రమాన్ని దేశ ప్రజలు కొనియాడేలా చేశాయి.

ఆ సందర్భం దేశభక్తి పూరితమైంది. దేశ పౌరులంతా మన సైనిక శౌర్యాన్ని శ్లాఘించారు. మే 7న రాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో తాము ఐదు ఐఏఎఫ్ జెట్లను కూల్చి వేశామని పాకిస్థాన్ చేసిన ప్రకటనను భారత్ అప్పుడు ఖండించలేదు. జరిగింది యుద్ధం.. ఈ పరిస్థితిలో నష్టాలు సహజమేనని మన వైమానిక దళం, కాల్పుల విరమణ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపింది. మూడు వారాల తర్వాత సీడీఎఫ్ జనరల్ అనిల్ చౌహాన్ దీనిపై వివరణ ఇచ్చారు. మనకు జరిగిన నష్టం విషయంలో దాపరికం అవసరం లేదు.

పాకిస్థాన్‌పై జరిపిన మిలటరీ ఆపరేషన్ ప్రాథమిక దశల్లో మనకు కొంత నష్టం వాటిల్లిన మాట వాస్తవమేనని జనరల్ చౌహాన్ స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించిన భారత్, ఈ ఆపరేషన్‌లో ఎదురైన నష్టాన్ని కప్పి పుచ్చాల్సిన అవసరం లేదు. నష్టం ఏ మేరకు జరిగిందనే దానికంటే నష్టానికి కారణాలను తెలుసుకొని సవరించుకొన్నామన్న జనరల్ చౌహాన్ మాట చాలా విలువైంది.

యుద్ధ సమయంలో తప్పుడు సమాచారం రాజ్యమేలితే, అది ఎంతో కాలం నిలవదు. గతంలో, వియత్నాం యుద్ధంలో తాము ఓడిపోయామని తెలిసినా అమెరికా అనేక ఏళ్లు దానిని ఒప్పుకోలేదు. 1971లో పెంటగాన్ పేపర్స్ లీక్ అమెరికా డొల్లతనాన్ని బయటపెట్టింది. అఫ్గానిస్థాన్ అంతర్గత పోరులో తల దూర్చి, ఆ దేశంపై పట్టు సాధించామని ఇరవై ఏళ్లపాటు అమెరికా అసత్యాలనే ప్రచారం చేసింది. అదీ ఉత్తదేనని తేలిపోయింది. అసత్యాలతో యుద్ధాలు గెలువలేమని ప్రపంచ యుద్ధాలూ మనకు నేర్పాయి.