29-06-2025 01:02:10 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద ఏజెన్సీ జిల్లా. విస్తారమైన అటవీప్రాంతంలో ఉండే ప్రాంతం. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పోడు వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తుంటారు. తాతల కాలం నుంచి వారు ఆ రకమైన వ్యవసాయం చేసుకుంటున్నారు. వారసత్వంగా తర్వాతి తరం వారు కూడా పోడు వ్యవసాయమే చేస్తారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో యేటా జరుగుతున్న విధంగానే, ఈసారి కూడా పోడు వ్యవసాయంపై అటవీశాఖ సిబ్బంది, పోడు రైతులకు మధ్య పోడు వివాదం నడుస్తున్నది.
రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పోడు సమస్యలు యేటికేడు జటిలంగా మారుతున్నాయి. సిర్పూర్ నియోజకవర్గం లో సాగవుతున్న భూముల్లో ఎక్కువ భాగం గిరిజనేతరులే చేతుల్లో ఉండటంపై అటవీశాఖ సీరియస్గా స్పందిస్తున్నది. ఆయా భూములు సాగవకుండా అటవీశాఖ సిబ్బం ది ఎప్పటిప్పుడు అడ్డుకుంటున్నారు.
దీంతో కొన్నిసార్లు పోడు రైతులు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తుతున్నది. ప్రభుత్వం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 15,254 మంది పోడు రైతులు సాగు చేసుకుంటున్న 44,750 ఎకరాల భూములకు పట్టాలు అందజేసింది. అయితే.. పోడు భూముల మొత్తానికి పట్టాలు ఇవ్వలేదని, తమకున్న భూమిలో కొంత భూమి మేరకే పట్టాలు ఇచ్చారని కొందరు రైతులు వాపోతున్నారు.
సీజన్ ప్రారంభమైనా తీరని సమస్య
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు నాటడం ప్రారంభమైంది. బెజ్జూరు మండలం పాపన్నపేట గ్రామం, చింతలమానపల్లి మండలం దిందా గ్రామం, పెంచికల్పేట్ మండలం జైయింద్ పూర్ గ్రామాల్లో మాత్రం సాగు ప్రారంభం కాలే దు. ఇప్పటికీ ఆ గ్రామాలకు చెందిన పోడు రైతులు భూపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పొలం పనులు చేసుకునేం దుకు భూమిలోకి వెళ్లగానే, వెంటనే అటవీశాఖ సిబ్బంది సమాచారం అందుకుని అక్కడ వాలిపోతున్నారు. నాగలితోనే పొలం దున్నాలని హుకుం జారీ చేస్తున్నారు. ట్రాక్ట ర్ల దున్నిస్తే చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. తాము పోడు వ్యవసాయాన్నే న మ్ముకుని జీవిస్తున్నామని, అటవీశాఖ సిబ్బంది తమను నిబంధనల పేరిట వేధించడం దారుణమని పోడు రైతులు వాపోతున్నారు.
యేటా ఆందోళన బాట.. జైళ్ల పాలు..
పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు యేటా వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే ముందు అటవీశాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ భూములు కాపాడుకునేందుకు జైలుకు సైతం వెళ్లిన సంఘట నలూ గతంలో అనేకం ఉన్నాయి. గతంలో కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ మం డలం శివారులో అటవీసిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో 70 మం ది పోడు రైతులు జైలుపాలయ్యారు. అలాగే రెబ్బెన మండలం తుంగేడ శివారులోని 42 ఎకరాల్లో పోడు సాగు చేస్తున్న 12 మంది రైతులు జైలుకు వెళ్లారు. వారికి మద్దతుగా నిలిచిన అప్పటి జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కష్ణా, ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు సైతం జైలుకు వెళ్లారు.
మంత్రులు చెప్పినా మార్పు లేదు..
పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను అటవీశాఖ సిబ్బంది, అధికారులు ఇబ్బందులకు గురిచేయొద్దని ఇప్పటికే పలువురు మంత్రులు అనేక సందర్భాల్లో సూచించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క కూడా పలు సందర్భాల్లో అటవీ సిబ్బందిని మందలించారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ సైతం పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కొత్తగా పోడు నరికే వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ సదస్సుల్లోనే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. తాజాగా పెంచికల్పేట్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ అటవీశాఖ పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించారు. అయినప్పటికీ కొందరు అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదని ఆదివాసీలు వాపోతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు ఉధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడం లేదు
కుమ్రం భీం జిల్లాకు చెందిన పోడు రైతులకు ఇప్పటికే ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటిలో గిరిజనులకు సంబంధించిన భూములు 80 వేల ఎకరాలు ఉన్నాయి. వీరందరికీ పట్టాలు ఉన్నాయి. కానీ, మరో 90వేల ఎకరాల భూమి గిరిజనేతరుల ఆధీనంలో ఉన్నట్లు మేం గుర్తించాం. ఆ భూముల్లోనే ప్లాంటేషన్ చేస్తున్నాం. అనధికారికంగా ఐదెకరాలకు పైగా భూముల్లో సాగు చేస్తున్న వారి భూములనే మేము స్వాధీనం చేసుకుంటున్నాం. సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడం లేదు. కానీ, కొందరు మా పనులకు అడ్డువస్తున్నారు. ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు మాకు సహకరించాలి. సామరస్య పద్ధతిలో వ్యవసాయం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
నీరజ్కుమార్ టిబ్రేవాల్, జిల్లా అటవీశాఖ అధికారి, ఆసిఫాబాద్
మి లాక్కుంటే మా కుటుంబం రోడ్డున పడుతుంది
మా కుటుం బం 40 ఏళ్ల నుంచి దిందా గ్రా మంలో ఉంటున్న ది. మేం 5 ఎకరాల్లో పోడు వ్యవ సాయం చేస్తున్నాం. మాకు ఆ భూమి తప్ప వేరే ఆధారమేమీ లేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నం. అటవీశాఖ అధికారులు ఇటీవల మా గ్రామానికి వచ్చి పోడు వ్యవసాయం చేయొద్దని హెచ్చరించారు. మేం సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటుతున్నామని చె ప్పారు. మా భూములు లాక్కుంటే, కుటుంబం రోడ్డున పడుతుంది. ప్రభుత్వం మాపై దయ చూపాలి. మమ్మల్ని ఆదుకోవాలి.
ఎలకరి బాలాజీ, పోడు రైతు,
చింతలమానపల్లి దిందా గ్రామం, ఆసిఫాబాద్ జిల్లా