calender_icon.png 17 January, 2026 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణం

17-01-2026 03:12:02 AM

  1. పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అచ్చంపేట, జనవరి 16: ఆకాశమే పందిరి...భూదేవే పెల్లి పీఠలుగా..  బ్రహ్మ నిర్ణయించిన శుభ ముహూర్తానా.. చుక్కలే అక్షితలుగా మారిన సమయాన.. వేదపండితుల మంత్రోచ్ఛరణతో శుక్రవారం పార్వతీ సమేత కైలాసనాథుని కల్యాణ వేడుక భక్తుల శివనామస్మరణ నడుమ కన్నుల పండువగా జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ సమీపంలోని నల్లమల అడవిలోని ఎత్తున కొండపై వెలసిన శ్రీఉమామహేశ్వర బ్రహ్మత్సవాల సందర్భంగా ఉమాసదుల కల్యాణ మహోత్స వాన్ని శుక్రవారం తెల్లవారు జామునా 4 గంటల సమయంలో వేడుకగా నిర్వహించారు.

అచ్చంపేటలోని శ్రీభ్రమరాంబదేవి ఆలయం నుంచి పార్వతి దేవిని ప్రభోత్సవంలో తీసుకొచ్చారు. కొండపై వెలసిన మహాశివున్ని మంగళవాయిధ్యాల నడుమ పల్లకి సేవలో భోగ మహేశ్వరానికి తీసుకొచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల ఆలయం తరఫున ఆలయ పాలక మండలి సభ్యుడు కట్టా సుధాకర్ రెడ్డి, సహాయ కార్యనిర్వాహణ అధికారి జి.స్వా ములు, వేదపండితులు గంటి రాధాకృష్ణ, సుబ్రమణ్యశర్మ, ముఖ్య అర్చకులు హరిశ్చంద్రమౌళి, పవన్ కుమార్ శర్మ, పరిచారక సాయి కుమార్ లు పట్టువస్త్రాలను స్వామివారికి అందజేశారు.

భోగ మహేశ్వరంలో ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకను కోలాహాలంగా నిర్వహించారు. మహాక్రతువును ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యశాస్త్రీ నిర్వహించారు. అనంతరం దేవేరులకు వడిబియ్యం పోసి మెక్కులు చెల్లించుకున్నారు. మహక్రతువులో ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, డా.అనురాధ దంపతులు పాల్గొని.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సవ కమిటీ ఛైర్మన్ భీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు, కమిటీ సభ్యుడు పవన్ ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, వివిధ పార్టీల నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.