17-01-2026 03:15:16 AM
హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు
బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతుభరోసా తదితర అంశాలపై చర్చ!
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్ట చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ఈసారి రాజధాని హైదరాబాద్కు దూరంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారంలో జరగనుంది. ఈ నెల 18న ఆదివారం సాయంత్రం 5 గంటలకు ము లుగు జిల్లా, మేడారంలోని హరిత హోటల్ వేదిక కానుంది. అయితే, సాధారణంగా సచివాలయంలో జరిగే క్యాబినెట్ సమావేశాన్ని ఈసారి గిరిజన ప్రాంతమైన మేడారంలో నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా మేడారం సమ్మక్క--సారల మ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ర్ట బడ్జెట్, మున్సిపల్ ఎన్నికలు, రైతు భరోసా వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ భేటీకి సంబంధించి ములుగు కలెక్టర్, ఎస్పీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మా పెండింగ్ బిల్లులను విడుదల చేయండి : మాజీ సర్పంచ్ల ఫోరం
మాజీ సర్పంచ్లకు రావాల్సిన రూ.531 కోట్ల పెండింగ్ బిల్లులపై మేడారంలో నిర్వహించే క్యాబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, గుంటి మధుసూదన్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుందనే ప్ర చారం జరుగుతోందని, అందులో మాజీ సర్పంచ్ల బిల్లులు చెల్లించేలా చూడాలని శుశ్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం చాలా మంది సర్పంచ్లు వడ్డీలకు అప్పులు తీసుకొచ్చారని, తీరా బిల్లులు రాకపోవడంతో కొంతమంది ఆత్మహత్య లు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రికి తమ గోడును వెల్లబోసుకున్నామని వారు పేర్కొన్నారు.