చమురు, ఎల్పీజీ నిల్వల కొరత లేదు!
భారత ప్రభుత్వ కీలక ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 13: దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభ వేదికగా స్పష్టమైన ప్రకటన చేసింది. చమురు ధరల నియంత్రణ, సరఫరా తలెత్తే ఆటంకాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపింది. ఎలాంటి పరిస్థితులైనా ఎందుర్కొంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధన నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎల్పీజీ కొరత వార్తలను పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోసిపుచ్చారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచినట్లు వివరించారు. ఎల్పీజీ కోసం పశ్చిమాసియాపై ఆధారపడటాన్ని తగ్గించామని, ఇతర దేశాల నుంచి ఎల్పీజీ నిల్వలు తెప్పిస్తున్నామని వెల్లడించారు. వాహనాలకు సీఎన్జీ సరఫరాలో కోతలు ఉండవని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు ఇరాన్ ఊరటనిచ్చింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి నుంచి భారత్కు రావాల్సిన రెండు ఎల్పీజీ నౌకలకు ఇరాన్ ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది.




