28-06-2025 12:00:00 AM
అజ్మీరా సీతారాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 27(విజయ క్రాంతి) కాంగ్రెస్ ఏడాదిన్నరా పాలనలో జిల్లాలో జరిగిన అభివృద్ధి శూన్యమని మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. శుక్రవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని వనరులు ఉన్నా అభివృద్ధి దిశగా ప్రస్తుత ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ జిల్లా పరిశ్రమల పరంగా ఎంతో బలమైనదిగా ఉండేది. కేటీపిఎస్, ఎన్ఎండిసి, ఏపీ స్టిల్స్ వంటి సంస్థలతో ఓ వెలుగు వెలిగిన పాల్వంచ ఇప్పుడు వలసల జిల్లా అయిందన్నారు. ఈ దుస్థితికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.ఎన్ఎండిసి మూతపడటం, కేటీపీఎస్ పాత ప్లాంట్ కూల్చివేత వంటి నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు.ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
ఈ ఉమ్మడి జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదన్నారు. ముఖ్యంగా గిరిజనుల ప్రాధాన్యత కలిగిన షెడ్యూల్ ఏరియాలలో పాల్వంచ, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు సమయంలో సంప్రదింపులు లేకపోవడం తగదన్నారు.
కిన్నెరసాని ప్రాజెక్టు పర్యాటక అభివృద్ధి, 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ అవసరం, పాల్వంచ విమానాశ్రయ ప్రతిపాదన వంటి అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయానికి సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్రం స్థల సేకరణలో జాప్యం చేస్తోంది, అని విమర్శించారు.
ఇంకా, కేంద్ర నిధులతో నిర్మిస్తున్న ఇళ్లను ‘ఇందిరమ్మ ఇళ్లుగా’ మళ్లీ పేరుమార్చి, కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించడం దారుణమని మండిపడ్డారు.ఈ సమావేశంలో బీజేపీ నేతలు భూక్య సీతారాం నాయక్, యాడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, బుడగం రవి, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, దోమల రమేష్, రవి రాథోడ్, దున్నపోతుల రాజు, దాసరి రమేష్, భూక్యా వెంకట్, మేకల రామారావు, బానోత్ వెంకటేశ్వర్లు, వీరన్న, గిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.