07-06-2025 02:16:32 AM
హుస్నాబాద్, జూన్ 6 : ‘పురుగుమందుల వాడకం అధికంగా ఉన్నందున మన పంటలను ఇతర దేశాలు తిరస్కరిస్తున్నాయి. తెలంగాణ పంటలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. అప్పుడే విదేశాలకు ఎగుమతులు సులభతరం అవుతాయి. రైతులు ఆధునిక సాగు పద్ధతులతో కొత్త పంటలు పండిస్తేనే ఇది సాధ్యమవుతుంది‘ అని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడులు, రాబడిని సాధించే మెలకువలను నేర్పించేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ’రైతు మహోత్సవం’ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగంలో మార్పు ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
‘మన తాతలు రెండు కిలోల యూరియా వాడితే, ఇప్పుడు మనం 150 కిలోల యూరియా వాడుతున్నాం. ఈ రసాయన ఎరువుల అతి వినియోగం వల్ల మన పంటల నాణ్యత దెబ్బతింటోంది. ఇది కేవలం దేశీయ మార్కెట్నే కాదు, అంతర్జాతీయ ఎగుమతులనూ ప్రభావితం చేస్తోంది‘ అని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే తెలంగాణ రైతులు సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ‘విదేశాలకు ఎగుమతి చేసే పంటలను టెస్ట్ చేసినప్పుడు, అవి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రకృతి సిద్ధంగా, సేంద్రీయ ఎరువులతో పంటలు పండిస్తేనే మన ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుంది‘ అని అన్నారు.
ఆధునిక సాగు పద్ధతులే కావాలె
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రాముఖ్యాన్ని మంత్రి వివరించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయాల వీసీలు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన రైతుల నుంచి మీరు నేర్చుకోవాలి. మన భూమికి ఏ పంట అవసరం, ఏ పంట వేస్తే అధిక ఆదాయం వస్తుందో చూసిన తర్వాతే పంటలు వేయాలి‘ అని రైతులకు సలహా ఇచ్చారు. పత్తి, వరి వంటి సంప్రదాయ పంటలపైనే కాకుండా, తక్కువ నీటితో పండే, అధిక డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్, కూరగాయలు, ఆకుకూరలు, పూల సాగు వంటి వాటిపై దృష్టి సారించాలని ప్రోత్సహించారు.
దుక్కులు దున్నకముందే రైతు భరోసా పైసలు ఇస్తం
ఆయిల్ పామ్ సాగు ద్వారా వచ్చే లాభాలను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘హుస్నాబాద్కు దగ్గరలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉంది. వచ్చే నెలలో దీన్ని ప్రారంభిస్తాం. ఆయిల్ పామ్ ద్వారా మూడవ సంవత్సరం నుంచే ఆదాయం వస్తుంది. అంతేకాకుండా, అందులో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. కోతుల బెడద ఉండదు. ప్రకృతి విపత్తులకు అవకాశం లేదు.
డ్రిప్ సబ్సిడీ కూడా ఉంటుంది‘ అని వివరించారు. ఖమ్మం రైతులు ఆయిల్ పామ్తో ఎలా లాభాలు పొందుతున్నారో ఉదాహరణగా చెప్పారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఇప్పటికే రూ. 35 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, ఈ సంవత్సరం రైతు భరోసా కింద పంటలు వేయకముందే డబ్బులు జమ అవుతాయని మంత్రి అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రైతులు అంతర్జాతీయ మార్కెట్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
తొండలు గుడ్లుపెట్టిన భూముల్ల బంగారం పండాలె : మంత్రి పొన్నం
హుస్నాబాద్ ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైందని, ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో వేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తొండలు గుడ్లు పెట్టిన భూముల్లో బంగారు పంటలు పండే రోజులు వస్తున్నాయన్నారు. ‘కిసాన్ మేళా ద్వారా రైతులు ఆధునిక పంటలసాగును తెలుసుకోవాలి.
సిద్దిపేట, కరీంనగ ర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి‘ అని కోరారు. హుస్నాబాద్లో విద్యాలయాల పెంపు, ఉపాధి అవకాశాల మెరుగుదల, కొం డలు, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి, పాడి పశువుల పెంపకం వంటి రంగాలలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా రు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ‘రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.
రైతును రాజు చేసే దిశ గా ప్రజా ప్రభుత్వం వెళ్తుంది‘ అని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, విత్తనాలు, గిట్టుబాటు ధరలు, యంత్రాలకు సబ్సిడీ అందిస్తూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, పంటలకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లాభాలు వస్తాయని అన్నారు. సబ్సిడీలు వస్తాయని, రైతులు టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవాలని, నకిలీ విత్తనాలు రాకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.