07-06-2025 02:15:48 AM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, జూన్ 6(విజయక్రాంతి): పోడు పట్టా భూములు పొందిన రైతులకు సోలార్ పంపుసెట్లు అందించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిర సౌర గిరి వికాసం పథకంపై గిరిజన సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, అటవీశాఖ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను 73 మంది రైతులను గుర్తించాలని ఆదేశించారు. రెండున్నర ఎకరాల భూమిని ఒక గ్రూప్గా తీసుకొని ఆ గ్రూప్ లోని రైతులకు ఒక యూనిట్ 6 లక్షల రూపాయలతో మోటార్స్, సోలార్ పంప్ సెట్స్ లాంటివి పంపిణీ చేయాలన్నారు. గిరిజన రైతుల వ్యవసాయ భూమి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.
బోర్లు, సోలార్ పంపుసెట్లు అందించాలన్నారు. వారికి వ్యవసాయం, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పునరుత్పత్తి శక్తి వనరులను వినియోగించి, సౌర విద్యుత్ ఆధారిత మౌలిక వసతుల కల్పనతో గిరిజన ప్రాంతాలలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు పాల్గొన్నారు.