పేజ్ ఇండస్ట్రీస్ లాభంలో 38% వృద్ధి
24-05-2024 12:05 AM
న్యూఢిల్లీ, మే 23: జాకీ బ్రాండ్ ఇన్నర్వేర్ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ నికరలాభం మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 38 శాతం వృద్ధిచెంది రూ. 108 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 78 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 3.2 శాతం పెరిగి రూ. 995 కోట్లకు చేరింది. ఇబిటా 24 శాతం పెరుగుదలతో రూ. 167 కోట్ల వద్ద నిలిచింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.120 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. డివి డెండు చెల్లింపునకు మే 31 రికార్డుతేదీగా నిర్ణయించగా, జూన్ 22లోపున చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది.






