11-06-2025 12:00:00 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ఇండియా చిత్రం ‘కుబేర’. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఈ చిత్రంలోని ‘పీ పీ డుమ్ డుమ్’ పాటను విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో హీరో ధనుష్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను బెగ్గర్ క్యారెక్టర్ చేశాను. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్, హోమ్వర్క్ చేశానని చెప్పను (నవ్వుతూ). మా డైరెక్టర్ను ఫాలో అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్ నేనిప్పటివరకు చేయలేదు. ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది. ఓ డంప్యార్డులో దాదాపు 7 గంటల పాటు నేను, రష్మిక షూటింగ్లో పాల్గొన్నాం. అక్కడ అంతసేపు ఉన్నా ఆమె బాగానే ఉంది. ‘నాకేం వాసన రావట్లేదు’ అని చెప్పింది.
మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదు (నవ్వుతూ). ఇలా ఎన్నో మంచి జ్ఞాపకాలు పంచిందీ కుబేర” అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. “కుబేర నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నప్పుడు శేఖర్ వచ్చారు. ఆయనతో కలిసి పనిచేయాలని 15 ఏళ్లుగా అనుకుంటున్నా. తన మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అది తెరపై కనిపిస్తుంది” అని చెప్పారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. “నటిగా కుబేర నాకు అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఇది ఐ ఓపెనర్ లాంటి సినిమా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది” అన్నారు. ‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకోవడం సవాలుగా అనిపించింది. డైలాగ్స్ అన్నీ తెలుగులోనే చెప్పా’ అని నటుడు జిమ్సర్భ్ తెలిపారు.