బాల కార్మిక, తప్పిపోయిన చిన్నారుల రక్షణే ముస్కాన్ లక్ష్యం
* నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు, గాలింపు చర్యలు
* ఆపరేషన్ ముస్కాన్–XIIపై పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీల సమీక్ష
* నిబంధనలు ఉల్లంఘిస్తే యజమానులపై చట్టపరమైన చర్యలు
మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని ఉమ్మడి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విజయవంతంగా అమలు చేయాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ అధికారులను ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో బుధవారం వేర్వేరుగా సమన్వయ సమావేశాలు నిర్వహించారు. నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విధులను సమీక్షించారు.
ఈ సందర్భంగా డీసీపీలు మాట్లాడుతూ.. వివిధ కారణాలతో తప్పిపోయిన చిన్నారుల ఆచూకీ కనుగొనడం, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో బాల కార్మికులుగా మగ్గుతున్న వారిని రక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. రక్షించిన బాలలకు సరైన సంరక్షణ, దీర్ఘకాలిక పునరావాసం కల్పించి సమాజంలో భాగస్వాములను చేయాలన్నారు. బాలల దోపిడీకి పాల్పడుతున్న వారిపై, చట్టవిరుద్ధంగా చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకునే యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ ముస్కాన్ ఆపరేషన్లో స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్లు (ఎస్జేపీయు), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఏహెచ్టీయు), ప్రత్యేక బృందాలతో పాటు జిల్లా బాలల సంరక్షణ, విద్యా, వైద్య ఆరోగ్య శాఖలు, బాలల సంక్షేమ కమిటీలు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి చిన్నారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని విభాగాలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సమన్వయ సమావేశంలో పోలీసు, శిశు సంక్షేమ శాఖ, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ (ఎన్సీఎల్పీ) ప్రతినిధులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






