ఆత్మహత్యల వైపు ఆలోచనలు!
ప్రతి పదిమంది విద్యార్థుల్లో ఒకరికి ఇదే ధ్యాస
- పలు వర్సిటీల్లో ఎన్ఐఐఎంహెచ్ సర్వే
- ఆందోళన కలిగిస్తున్న నివేదిక ఫలితాలు
- నివారణకు గురుకులాల ముందస్తు చర్యలు
- హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): చదువు, ఒత్తిడితోపాటు ఇతరత్ర కారణాల వల్ల ఈ మధ్య అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరిలో స్కూల్ స్థాయి నుంచి మొదలుకొని వర్సిటీ స్థాయి వరకు ఉన్నారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లోనూ ఆత్మహత్య కేసులు నమోదవడం చూస్తున్నాం.
తాజాగా మెల్బోర్న్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సెన్సైస్, పలు ఇండియన్ మెడికల్ కాలేజీలు (ఎన్ఐఐఎంహెచ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. కొం దరు విద్యార్థులు పదిమందిలోనే ఉంటారు.. కానీ, ఎప్పు డూ ఒంటరినే అనే ఫీలింగ్, బతకడం దండగ అనే ఆలోచనలతో ఉంటారని పేర్కొంది.
గత కొంతకాలంగా మన దేశంలోని విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆందోళనకర పరిస్థితి నేపథ్యంలో ఈ సర్వేను చేపట్టారు. పదిమంది విద్యార్థుల్లో ఒకరి ఆలోచనలు ఆత్మహత్య చుట్టూ తిరుగుతున్నట్టు సర్వే లో గుర్తించారు. అయితే ఈ సర్వే నివేదిక ఆధారంగా ప్రభు త్వం గురుకుల విద్యార్థుల్లో నమోదవుతున్న ఆత్మహత్యలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సర్వేలో సూచించిన అంశాలను అమలు చేసి, ఆత్మహత్యల కట్టడికి పకడ్బందీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది.
30 వర్సిటీల్లో సర్వే..
తొమ్మిది రాష్ట్రాల్లోని 30 వర్సిటీలకు చెందిన 8,542 మంది విద్యార్థుల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. అయితే 2 శాతం మంది విద్యార్థులు ఏడాదిలో ఆత్మహత్య ఆలోచనలు చేయగా.. 5 శాతం మంది ఆత్మహత్యయత్నాలు కూడా చేసినట్టు ఈ సర్వే వెల్లడించింది.
40 మంది విద్యార్థులున్న క్లాస్లో నలుగురు జీవితంపై ఆశలు కోల్పోయారని, ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించా రని సర్వేలో గుర్తించారు. ఐఐటీ, నీట్, ఐఐఎం విద్యార్థుల్లోనూ సూసైడ్ టెండెన్సీ ఎక్కువగా ఉందని తెలిపింది. పరీక్షల ఒత్తిడి, కుటుంబ సంబంధాలు సరిగా లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంది.
కట్టడికి చర్యలు..
ఈ సర్వే ఆధారంగా తెలంగాణలో వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో విద్యార్థుల్లో ఇలాంటి ఆలోచ న ధోరణులకు అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గురుకులాల్లో టీచర్లకు విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారి మానసిక పరివర్తనలపై శిక్షణ ఇప్పించాలని టీజీఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్ గురుకుల కార్యదర్శి డాక్టర్ వీ ఎస్ అలగు వర్షిణి నిర్ణయించారు.
గురుకుల విద్యార్థుల్లో కుంగుబాటును దూరం చేసి మానసిక ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఎల్పీ మాస్టర్ ట్రైనర్ రఫీ నేతృత్వంలో (మ్యాజిక్ ఆఫ్ ఛేంజ్ సంస్థతో కలిసి) గురుకుల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 17, 18, 19, 20 తేదీల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో గురుకుల టీచర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
దృష్టి సారించే అంశాలు
- మానసిక వికాసం, భావోద్వేగ స్థితుల అవగాహన
- కౌమరదశకు ఎదుగుతున్న విద్యార్థుల మానసిక స్థితులు ఎలా మారుతాయన్న దానిపై అవగాహన.
- భావోద్వేగ ప్రేరేపణలను గుర్తించడం విద్యార్థుల మౌఖిక, అమౌఖిక హావభావాల ద్వారా భావోద్వేగ పరిస్థితులను గుర్తించడం.
- భావోద్వేగ మ్యాపింగ్, ప్రవర్తన విశ్లేషణ
- విద్యార్థుల భావోద్వేగ ధోరణులను విశ్లేషించి, సరైన రీతిలో వారికి అవగాహన కల్పించడం.
- న్యూరోసైన్స్ ఆధారిత భావోద్వేగ నియంత్రణ వ్యాయామాలు
- ఉపాధ్యాయులు, విద్యార్థులు భావోద్వేగాలను సమర్థంగా నియంత్రించుకు నేందుకు సాధనాలు.




