calender_icon.png 30 July, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డామిట్ కథ అడ్డం తిరిగింది

29-07-2025 04:07:20 PM

గోదావరిఖనిలో వ్యాపారులను రూ.10 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ లో బెదిరించి పోలీసులకు పట్టుబడిన వ్యక్తి

చాకచక్యంగా చేదించిన 1-టౌన్ పోలీసులు

గోదావరిఖని,(విజయక్రాంతి): డామిట్ కథ అడ్డం తిరిగింది. సులువుగా డబ్బులు సంపాదించాలని, సినిమా పక్కిలో గోదావరిఖనిలోని పలువురు బడా వ్యాపారులకు  ఫోన్ చేసి 10 లక్షలు పంపించాలంటూ బెదిరించిన సంఘటన బెడిసి కొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.  ఈ మేరకు మంగళవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో  సీఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన వివరాలు వెల్లడించారు. ఈనెల 18న ఒక వ్యక్తి కళ్యాణ్ నగర్ కు చెందిన ఇద్దరు వ్యాపారస్థులకు ఫోను చేసి ఒక్కొక్కరు  తలా పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లేనిచో వారి కుటుంబ సభ్యులకు హాని చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినాడు.

గత కొంత కాలం క్రితం గోదావరిఖని చౌరస్తాలో ఒక వ్యక్తిని మర్డర్ చేసింది నేనేనంటూ అదే పరిస్థితి నీ ఫ్యామిలీకి కూడా పడుతుందని సదరు వ్యక్తులను బెదిరించాడు. ఆ బెదిరింపులతో భయపడిపోయిన వ్యాపారస్తులు ప్రాణభయంతో భయాందోళన గురై 22న ధైర్యం చేసి ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై కె.రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరించిన వ్యక్తి ఫోన్ నెంబర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గోదావరిఖని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతనిని గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ కి చెందిన యాదనవేని తిరుపతిగా గుర్తించి ఇవాళ అరెస్టు చేసి అతని వద్ద బెదిరింపులకు పాల్పడడానికి ఉపయోగించిన ఫోన్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ  తెలిపారు.

కాగా, నిందితుడు తిరుపతి గత ఐదేళ్ల  క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నుండి  గోదావరిఖనికి వచ్చి కిరాణం షాపులలో హమాలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యనే చంద్రశేఖర్ నగర్ లో ఇల్లు కూడా కొనుగోలు చేసి కుటుంబంతో ఉంటున్నాడు. కిరాణం షాపు యజమానుల కదలికలు రోజు చూస్తూ వారిని బెదిరించి డబ్బులు సులభంగా తీసుకోవచ్చని  ఈ పన్నాగం పన్ని  ఫోన్లు చేసి బెదిరించాడు. మొదటగా వ్యాపారస్తులు సైబర్ నేరాలకు సంబంధించింది కావచ్చు అనుకున్నారు. తర్వాత రెండు మూడు రోజులు భయాందోళనలకు గురి అయ్యారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేసిన ఎవరిని ఉపేక్షించేది లేదని  సీఐ  హెచ్చరించినారు. సమావేశంలో ఎస్సై కె.రమేష్, సిబ్బంది ఉన్నారు.