02-06-2025 12:24:45 AM
సంగారెడ్డి, జూన్ 1(విజయక్రాంతి): వానాకాలం నేపథ్యంలో రేషన్ లబ్దిదారులకు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్డుదారులకు సరిపడా కోటా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు అవసరమైన సన్నబియ్యం సరఫరా చేసేందుకు గాను నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలను కేటాయించింది.
దీంతో ఆయా జిల్లాల నుంచి స్థానిక ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం చేరుకుంటుండగా రేషన్ షాపుల వారీగా సరఫరా ప్రారంభించారు. జూన్ 1 నుంచి కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. సర్కారు నిర్ణయంపై కార్డుదారుల్లో హర్షం..డీలర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇబ్బందులు లేకుండా...
వర్షాకాలంలో రోడ్డు కనెక్టివిటీ లేనటువంటి గ్రామాల ప్రజలు రేషన్ బియ్యం పొందేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి సరఫరా చేసేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు అవసరమైన కోటా విడుదల చేయగా జిల్లాలోని 6 ఎంఎల్ఎస్ పాయింట్లకు సన్నబియ్యం చేరుతున్నాయి.
వాటిని కేటాయింపుల ఆధారంగా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్నారు. కార్డుదారులు మూడు నెలల కోటా బియ్యం ఒకేసారి తీసుకోవాలంటే డీలర్ వద్ద గల పీఓఎస్ డివైస్పు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. అలా కాకుడా ఎప్పటిలాగే ప్రతినెలా తీసుకుంటామంటే అలాకూడా తీసుకునే వెసలుబాటు కల్పించింది.
జూన్ 1 నుంచి 30 వరకు డీలర్లు పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులుండగా, 3,78,728 కార్డుదారులకు బియ్యం సరఫరా అవుతుంది. ఈసారి మూడు నెలలకు కలిపి 22వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు.
డీలర్ల ఆందోళన...
ప్రభుత్వ నిర్ణయాన్ని కార్డుదారులు స్వాగతిస్తుండగా డీలర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకు సరిపడా కోటా బియ్యం మాత్రమే నిల్వ చేసేలా రేషన్ షాపులు ఉండడంతో ఒకేసారి మూడు నెలల కోటా తీసుకుంటే వాటిని ఎక్కడ నిల్వ చేయగలమని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు కొన్ని షాపుల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వల తరలింపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి.
తాజాగా పూర్తి స్థాయిలో బియ్యం తెచ్చుకుంటే భారీ వర్షాలకు బియ్యం తడిసి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హైరానా పడుతున్నారు. అయితే ఈ విషయంలోనూ వారికి వెసలుబాటు కల్పించినట్లుగా పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీని ప్రారంభించి, ఖాళీ అయిన నిల్వల వారీగా తీసుకెళ్ళాలని సూచిస్తున్నారు. తద్వారా వారికి కొంత ఊరట కలగనుంది.
ఇబ్బందులు లేకుండా చూస్తాం..
వర్షాకాలంలో ప్రభుత్వం అందించే సన్న బియ్యం తీసుకునేందుకు లబ్దిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మూడు నెలల కోటా ఒకేసారి విడుదల చేసింది. డీలర్లు తమకు కేటాయించిన ఆధారంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం తీసుకెళ్ళవచ్చు. అయితే కార్డుదారులు ఒకేసారి బియ్యం తీసుకోవచ్చు.
- అంబదాస్ రాజేశ్వర్రావు, మేనేజర్, పౌరసరఫరాల శాఖ