09-06-2025 02:09:24 AM
అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్కు మంత్రి పదవులు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు కొత్త మంత్రులు కొలువుదీరారు. మలి దశ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవులు దక్కించుకున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమా ర్గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగు లేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
మంత్రి పదవులు దక్కించుకున్న ముగ్గురూ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారే కావడం విశేషం. మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో అడ్లూరి లక్ష్మణ్కుమార్, గడ్డం వివేక్ ఎస్సీ లు కాగా, వాకిటి శ్రీహరిది బీసీ సామాజికవర్గం. రెడ్డి, వెలమ, ఎస్టీ సామాజికవ ర్గాల నుంచి కొందరు మంత్రి పదవులు ఆశించినప్పటికీ వారికి ఆశాభంగమే కలిగింది. ఎస్టీలకు మంత్రి పదవి దక్కకపో యినా డాక్టర్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కిన్నట్లు సమా చారం.
మంత్రివర్గంలో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా, అధిష్ఠానం కేవలం మూడు బెర్తులను భర్తీ చేసింది. మరో మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నా యి. మరోవైపు కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముగ్గురు మంత్రులతో సీఎం రేవంత్ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 14కు చేరింది.
‘అడ్లూరి’ అలుపెరగని పోరాటం..
అడ్లూరి లక్ష్మణ్కుమార్ 1౯౬౮ ఏప్రిల్ 1న అడ్లూరి నాగయ్య, లక్ష్మి దంపతులకు జన్మించారు. ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన ఆయన డిగ్రీ చదివారు. తర్వాత ఆయనకు కాంతాకుమారితో వివాహమైంది. 1982లో ఆయన గోదావరిఖనిలోని జూనియర్ కాలేజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా 85 వరకు కొనసాగారు. 1986 94 వరకు సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుంచి 2001 వరకు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ విభాగ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
2004లో నంది మేడారం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపో యారు. 2006లో ధర్మారం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి నియోకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2010 వరకు కరీంనగర్ జడ్పీ చైర్మన్గా సేవలందించారు. 2010లో ధర్మపురి అసెంబ్లీ నియోజ కవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసినా మళ్లీ ఓటమే ఎదరైంది.
2013 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా 2014, 2018 ఎన్నికల్లోనూ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2018 నుంచి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ వస్తున్నారు. 2023 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాంగ్రెస్ అ ధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వ విప్గా లక్ష్మణ్కుమార్కు అవకాశమిచ్చా రు. ఆయన నిబద్ధత, నిజాయతీని పార్టీ గు ర్తించి మంత్రి పదవి కట్టబెట్టిందని పార్టీ వర్గా లు కొనియాడుతున్నారు. మంత్రి విస్తరణ జరుగబోతున్నదని తెలిసిన నాటి నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్, మానకొండూర్ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణతోపా టు పలువురు తమ సామాజిక వర్గంలో ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఢిల్లీ లో ఏఐసీసీ అగ్రనేతలందరినీ కలిశారు. చివరకు మంత్రి పదవి దక్కించుకున్నారు.
సర్పంచ్ నుంచి శ్రీహరి ప్రస్థానం..
వాకిటి శ్రీహరి 1౯౭౨ నవంబర్ 1న వాకిటి నర్సింహులు, రాములమ్మ దంపతులకు జన్మించారు. బీసీ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయన బీఏ చదివారు. ఆయనకు లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు అచ్యుతరామ్, అమిత్ సాయిరాజ్. శ్రీహరి సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు వాకిటి శ్రీహరి.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి అనుబంధ సంఘమైన ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ సహా ఎన్నో విభాగాల్లో ఆయన పార్టీకి సేవలందించారు. పార్టీకి విధేయుడిగా, విశ్వాసపాత్రుడిగా శ్రీహరి మెలుగుతూ వస్తున్నారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా ఆయన బీసీగా మంత్రి పదవి దక్కించుకున్నారు.
అంతేకాదు.. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మంత్రి పదవి దక్కించుకున్న మొదటి నేతగా రికార్డు సృష్టించారు. శ్రీహరి 1996లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి 2001 వరకు పార్టీ మక్తల్ మండల కార్యదర్శిగా పనిచేశారు. 2001 వరకు మక్తల్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా సేవలందించారు. 2001 సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా ఆయన రికార్డు సృష్టించారు.
ఇదేకాలంలో పార్టీ మహబూబ్నగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. 2014 18 వరకు మక్తల్ జడ్పీటీసీగా, ఇదే కాలంలో మహబూబ్నగర్ జిల్లా పరిషత్లో జడ్పీ ఫ్లోర్ లీడర్గా, కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 2018 నుంచి కృష్ణా జలాల పరిరక్షణ సమితిలో సభ్యుడిగా కొనసాగారు.
2022 వరకు నారాయణపేట పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.
వివేక్ను వరించిన మంత్రి పదవి..
౧౯౫౭ నవంబర్ ౩౦న గడ్డం వెంకటస్వామి (కాకా), కళావతి దంపతులకు వివేక్ జన్మించారు. ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన ఆయన ఓయూలో ఎంబీబీఎస్ చదివారు. ఆయనకు సరోజతో వివాహమైంది. వీరి సంతానం వృత్తిక, వంశీ, వెంకట్, వైష్ణవి. తండ్రి గడ్డం వెంకటస్వామి(కాకా) వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ సుదీర్ఘ కాలం నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నారు.
2009 లోక్సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2013 జూన్లో ఆయన అప్పటి టీఆర్ఎస్లో చేరారు. సరిగ్గా ఎన్నికల సమయంలో 2014లో టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత మళ్లీ 2016లో తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు.
2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తాజాగా వివేక్ మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చోటు
మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్ఠానం సామాజిక న్యాయమనే సూత్రాన్ని పాటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. బీసీల్లో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఎస్సీల్లో మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాల సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్కు మంత్రి పదవులు కట్టబెట్టింది. లంబాడ సామాజికవర్గం నుంచి ఉప సభాపతిగా రామచంద్రనాయక్ను ఎంచుకున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఎస్టీల నుంచి సీతక్క మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తొలుత అధిష్ఠానం మంత్రివర్గంలో నలుగురికి అవకాశం కల్పించాలని భావించింది. కానీ, చివరికి ముగ్గురికే పరిమితమైంది. కొద్దిరోజుల క్రితం ఓసీ సామాజికవర్గం నుంచి సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్లు వినిపించినా, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీ వర్గాలకే అవకాశం ఇచ్చింది.