04-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపు
ఆదిమ గిరిజనుల దీక్షకు మద్దతు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 3 ( విజ యక్రాంతి): జిల్లాలోని ఆదివాసీల భూములను లాక్కొనే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకి తీసుకవచ్చిన కాగజ్ నగర్ టైగర్జోన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆదిమ గిరిజన భూరక్షణ పోరాట కమిటీ, రాజ్ గోండ్ సేవా సమితి, గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో 6వ రోజు శాంతియుత నిరసన దీక్షకు మద్దతు పలికా రు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టైగర్ జోన్ పేరుతో భూములు తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టైగర్ జోన్ అయితే ఆదివాసీల జీవితాలు చిద్రమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఆదివాసీల అంతా కలిసి కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో వ్యతిరేకించాలన్నా రు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పోడు వ్యవసా యం చేస్తున్న రైతులపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యాలు చేస్తు న్నారనీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి తోత్తులుగా అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసి గ్రామాల్లో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. ఆదివాసీల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ అనే నినాదంతో వారి హక్కులు సాధించిన కొము రం భీం పోరాటమే తమ స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు.
ఆదివాసి గ్రామాలకు రహదారి నిర్మాణం కోసం అటవీ శాఖ అధికారులు అనుమతివ్వాలని, డిమాండ్ చేశారు. ఆదివాసుల కోసం ఎప్పుడు అండగా ఉంటానని ఇప్పటికైనా అధికారులు గిరిజనుల హక్కులకు అడ్డు రాకుండా శాంతియుతంగా ఉండాలని, పరిస్థితి ఉదృతం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల నాయకులు అర్జు మాస్టర్, బుర్స పోచయ్య, సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, అన్ని మండలా ల ఆదివాసి సంఘాలు పాల్గొన్నాయి.