09-06-2025 12:34:17 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడ, జూన్-08 (విజయక్రాంతి) తిప్పాపూర్ లోని కోడెల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం తిప్పాపూర్ లోని గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, గోశాలలో ఉన్న ఆరోగ్యవంతమైన కోడెలు స్థానిక రైతులకు ఉచితంగా సోమవారం నాడు పంపిణీ చేస్తున్నామని, కోడెల పంపిణీకి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కోడెల పంపిణి చేసే రైతులకు సంబంధించి సంపూర్ణ వివరాలు సేకరించాలని, రైతుల దగ్గరి నుంచి డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు.గోశాలలో అనారోగ్యంగా ఉన్న కోడెల ఆరోగ్య స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న కోడెల కు పశువైద్య అధికారులు చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలుసుకున్నారు. గోశాల పరిసరాలను శుభ్రం చేసి, గడ్డిని తొలగించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ అన్వేష్,పశు వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.