17 May, 2026 | 1:18 AM

ప్రహరీ నిర్మాణంలో ఆలయ ఆనవాళ్లు

17-05-2026 12:00 AM

మహబూబాబాద్/వెంకటాపూర్ (విజయక్రాంతి) : ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క, సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మాణం కోసం జేసీబీ యంత్రాలతో పునాదులు తీస్తుండగా పురాతన ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. క్యాంపస్ చుట్టు భారీ ప్రహరీ నిర్మాణం కోసం జేసీబీలతో లోతుగా పునాదులు తవ్వు తుండగా భారీ రాతి నిర్మాణాలు బయటపడ్డాయి.

గిరిజన యూనివర్సిటీ నిర్మాణ స్థలం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయానికి సమీపంలో ఉండటం, అదే పరిసర ప్రాంతంలో ఇప్పుడు బయటపడిన ఈ శిలలు కూడా కాకతీయుల కాలం నాటివే అయ్యుండొచ్చని భావిస్తున్నారు. ఆకృతులను గమనించిన కొందరు ఇవి చిన్న ఉప ఆలయాలు లేదా కాకతీయుల కాలానికి చెందిన మండప నిర్మాణాల అవశేషాలు కావచ్చని అభిప్రాయపడుతున్నా రు. తవ్వకాలు కొనసాగుతున్న సమయంలో పురాతన రాతి శిలలను జేసీబీ కదిలిస్తున్న సమయంలో రాళ్ల మధ్య నుంచి ఒక్కసారిగా నాగుపాములు బయటకు వచ్చాయి.

మూడు పెద్ద నాగుపాములు బయటకు రావడంతో అక్కడున్న కార్మికులు, అధికారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీన్ని స్థానికులు ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు బయటపడిన శిలలు, నిర్మాణ అవశేషాలపై నిపుణులు త్వరలో పరిశీలన చేపట్టనున్నారు. అప్పటి వరకు తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని యథాతథంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.