calender_icon.png 2 June, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ టూ లారీ!

31-05-2025 01:23:28 AM

ధాన్యం క్లియర్ కోసం అధికారుల పాట్లు

మహబూబాబాద్, మే 30 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో ఇంకా మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్ళను క్లియర్ చేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయడానికి అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో అటు ఖరీఫ్ పనులు, ఇటు ధాన్యం కొనుగోలు పూర్తికాక రైతులు ఆందోళన ఉదృతం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో చివరి దశలో ఉన్న ధాన్యం కొనుగోళ్ళు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కే.వీర బ్రహ్మచారి, ఇతర జిల్లా స్థాయి అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్ళను వేగవంతంగా ముగించడానికి చర్యలు చేపట్టారు. అదనపు కలెక్టర్ జిల్లాలోని నరసింహులపేట, దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో పర్యటించారు.

క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు జరుగుతున్న ఇబ్బందులను అక్కడికక్కడే పరిష్కరిస్తూ, మిగిలిపోయిన ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారు. మాటేడు ధాన్యం కేంద్రంలో కాంటాలు పూర్తిచేసి ఎగుమతికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను లారీల ద్వారా ఎగుమతి చేయడానికి కొనుగోలు కేంద్రం ఆవరణ పూర్తిగా బురదమయంగా మారి లారీలు దిగబడుతుండడంతో వెంటనే ట్రాక్టర్లను తెప్పించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా రోడ్డుపైకి తెచ్చి లారీలో లోడ్ చేయించారు.

ఇలాంటి పరిస్థితి ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని రోడ్డుపైకి తెచ్చి లారీల్లోకి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసి, మిల్లులకు తరలిస్తామని చెప్పారు.

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వీలైనంతవరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, ఆ లోపు వర్షం వస్తే ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు, రైతులకు అదనపు కలెక్టర్ సూచించారు.

1.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా యాసంగి సీజన్లో 1.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గత ఏడాది యాసంగి సీజన్లో కేవలం 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈసారి రికార్డు స్థాయిలో నాలుగు రెట్లు అధికంగా ధాన్యం సేకరించినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాలకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ 500 రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో రైతులు అందించిన సన్న ధాన్యాన్ని  ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించకుండా దాదాపు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 239 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని చెప్పారు.

ప్పటికే 90 శాతానికి పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పూర్తిచేసి సెంటర్లను క్లోజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా ఇంకా అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన 3,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. వాతావరణం అనుకూలిస్తే వారం రోజుల్లో పూర్తిగా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ముగిస్తామని కలెక్టర్ ప్రకటించారు.