తేనెటీగల పెంపకంపై శిక్షణ
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన యువతకు తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధి పొంది జీవనోపాధి కల్పించుకోవడానికి తేనెటీగల ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని వైటిసి లో ఆదివాసి గిరిజనులకు ఏర్పాటు చేసిన తేనెటీగల పెంపకం శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు తేనెటీగల పెంపకం వైటిసి, కృషి విజ్ఞాన కేంద్రం కొత్తగూడెం ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచితంగా తేనెటీగల పెంపకం గురించి మెలకువలు అందించి తేనెను సేకరించిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో ఈ శిక్షణ ద్వారా తెలుసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఆయన అన్నారు.
తేనెటీగల పెంపకం శిక్షణ తీసుకున్న యువకులు కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని తమ కుటుంబాలను పోషించుకోవాలని, ఆదివాసి గిరిజనులు సేకరించే తేనేకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, తప్పకుండా శిక్షణ అవగాహన చేసుకొని గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న యువకులు మీ గ్రామంలోని వేరే యువకులకు తెలియజేసి వారు కూడా తేనెటీగల పెంపకంపై మక్కువ కలిగేలా చేసి ఉపాధికి బాసటగా నిలవాలని అన్నారు. అనంతరం గిరిజన మ్యూజియంలో సందర్శించి ముక్కోటి నాటికి ట్రైబల్ మ్యూజియం పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఆదేశించినందున లైటింగ్ తో పాటు గుడిసెలు, బోటింగ్ ప్రదేశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే పూర్తిస్థాయిలో ఎల్ఈడీ లైట్లు అవసరం ఉన్నచోట ఏర్పాట్లు చేయాలని సంబంధిత ఏజెన్సీదారులకు సూచించారు.
మ్యూజియంకు వచ్చే టూరిస్టులకు చూసిన ప్రతి వస్తువు ఆకర్షించేలా కనిపించాలని ఆ విధంగా మ్యూజియం అభివృద్ధికి జరుగుతున్న పనులు అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏ పీ ఓ పవర్ ఏఈ మునీర్ పాషా, జేడీఎం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి తేనెటీగల పెంపకం కోఆర్డినేటర్ శివ తదితరులు పాల్గొన్నారు.






