14-06-2025 07:28:48 PM
బాధ్యతలు విస్మరిస్తే కఠిన చర్యలు..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో గత నాలుగు రోజుల నుండి పారదర్శకంగా హోంగార్డు, కానిస్టేబుల్స్, ఏఎస్ఐ ల బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలు లేకుండా పరస్పర అంగీకారంతో మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(Kamareddy District SP Rajesh Chandra) శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. 79 మంది హోంగార్డులు, 63 మంది సివిల్, 7 మంది ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుల్స్, 20 మంది సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, 23 మంది అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ఏఎస్సైలు) లకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టడం జరిగిందన్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్ వాడ సబ్ డివిజినల్ పరిధిలోని హోంగార్డు నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు బదిలీల ప్రక్రియను వ్యక్తిగతంగా అధికారులతో కౌన్సిలింగ్ నిర్వహించి, విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్ ప్రిఫరెన్స్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సేవా రికార్డుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ముగించినట్టు తెలిపారు. పారదర్శక బదిలీలతో పాటు ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో,విధులు నిర్వహించాలని ప్రజల మధ్య ఎల్లప్పుడూ విజిబుల్ పోలీస్ గా ఉండేలా శ్రమించాలని సూచించారు.నిబంధనలు పాటించకపోతే శాఖపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త స్థానాల్లో ప్రతి ఒక్కరు నూతన ఉత్సాహంతో, పోలీస్ శాఖకు మచ్చ రాకుండా నిజాయితీగా పనిచేయాలని అన్నారు. ప్రజల పట్ల బాధ్యతతో విధుల్లో నిమగ్నం కావాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.