పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
– జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి వ్యక్తి విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ ఎక్స్ రోడ్డులోని గౌడ సంఘం స్థలంలో నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విస్తృతంగా మొక్కలు నాటడం అవసరమని, నాటిన మొక్కలను సంరక్షించినప్పుడే వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.అనంతరం గౌడ సంఘం నాయకులు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్తో పాటు ఎక్సైజ్ ఎస్హెచ్ఓ రాజేశ్వర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు రాము గౌడ్, మోహన్ గౌడ్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






