18-06-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సెక్షన్ సౌత్ బీట్ లో 1149 కంపార్ట్మెంట్ ఫారెస్ట్ భూమి లో అటవీశాఖ అధికారులు భూమి ఆక్రమించకుం డా జెసిబి తో ఫ్రెంచ్ పనులు నిర్వహిస్తుండగా ఆ భూమి మాదే నంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ట్రెంచ్ పనులు నిర్వహిస్తున్న జెసిబికి అడ్డుగా కొందరు గిరిజన మహిళ రైతులు అడ్డుపడడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఏండ్ల తరబడిగా తాము ఆ భూమిని సాగు చేసు కుంటున్నామని, తమకు ప్రభుత్వం నుండి హక్కు పత్రాలు కూడా వచ్చాయని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు, డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా వచ్చి ఖండాలు తీయడం సరికాదంటూ గిరిజనులు అడ్డుకున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని మా పొట్ట కొట్టకండి అని వేడుకున్నారు.
అవసరమైతే మా ప్రాణాలను వదులుకుంటామని, కందకం తీయ కుండా అడ్డుకుంటామని భీష్మించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింప చేశారు.
కేసముద్రం ఎస్ ఐ మురళీధర్ మాట్లాడుతూ వివాదాస్పద భూమికి సంబంధించిన ఆధారాలు, అవసరమైన పత్రాలు తీసుకువచ్చి సమర్పించాలని, ఆ తర్వాత రెవెన్యూ శాఖ సర్వే ఆధారంగా భూమి ఎవరిది అనేది నిర్ణయించడం జరుగుతుందని అప్పటివరకు, గొడవకు దిగవద్దని సూచించడంతో తాత్కాలికంగా గొడవ నిలిచిపోయింది.