ట్రక్కు-బస్సు ఢీ: నలుగురు మృతి, 37 మందికి గాయాలు
చెన్నై: తమిళనాడులోని రాణిపేటలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ (Karnataka State Road Transport Corporation) బస్సు, ట్రక్కు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 37 మంది గాయపడ్డారు. రాణిపేటలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమై రోడ్డు భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మృతులు మంజునాథన్, కృష్ణప్ప, శంకరన్, సోమశేఖరన్గా గుర్తించినట్లు రాణిపేట పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల మృతదేహాలకు రాణిపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. క్షతగాత్రులను వేలూరులోని ఆస్పత్రికి తరలించారు. ఓం శక్తి మాత(Om Shakthi Mathe) దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. వీరంతా శ్రీనివాసపుర తాలుకా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డిసెంబరు 26న చెంగల్పట్టు జిల్లాలోని పడాలం సమీపంలో చెన్నై-తిరుచ్చి హైవే(Chennai-Trichy highway)పై జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపు తప్పి మరో వాహనం ఢీకొనడంతో గణపతి (40), ఆయన కుమార్తె హేమ (13), కుమారుడు బాల (10) తీవ్రంగా గాయపడ్డారు. గణపతి భార్య శరణ్య (35), ఆమె సోదరి జయ (30), ఆమె కుమార్తె దివ్య (3) సహా కుటుంబం నుండి ప్రాణాలతో బయటపడిన వారు చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబం చెన్నై నుంచి దిండిగల్కు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.






