05-06-2025 01:39:26 PM
జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్
మంచిర్యాల, (విజయక్రాంతి): క్షయ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తేనే వ్యాప్తిని అరికట్టవచ్చునని జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్(Tuberculosis Prevention Officer Sudhakar Nayak) అన్నారు. గురువారం పట్టణంలోని గొల్లవాడ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి నివారణకై అవగాహన కల్పించారు. రెండు వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించాలనీ, జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారనీ, క్షయ వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ, చికిత్స పూర్తయ్యే వరకు ప్రతినెల వెయ్యి రూపాయల చొప్పున పోషణ భత్యాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి, పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ శిబిరంలో అవసరం ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేశారు. అలాగే ఎక్స్ రే అవసరం ఉన్నవారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 102 వాహనం ద్వారా తీసుకెళ్లి తీసుకొచ్చారు. బిపి షుగర్ లతో సహా 50కి పైగా పరీక్షల కోసం సేకరించి టి-హబ్ కి పంపించారు. ఈ శిబిరంలో ప్రోగ్రాం అధికారి ప్రసాద్, డాక్టర్ రాము, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ శివప్రతాప్, సీ హెచ్ ఓ రామమూర్తి, హెల్త్ ఎడ్యూకేటర్ అల్లాడి శ్రీనివాస్, క్షయ విభాగం సిబ్బంది జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సురేందర్, సాయరెడ్డి, స్వప్న, ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత, మాజీ కౌన్సిలర్ సదానందం, ఆర్బీ ఎస్కే సిబ్బంది, పాత మంచిర్యాల పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.