టి ట్వంటీ ప్రపంచ కప్
అఫ్గాన్ శుభారంభం
ప్రొవిడెన్స్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ భాగంగా పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ సేన 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (45 బంతుల్లో 76; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (46 బంతుల్లో 70; 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్థశతకాలతో చెలరేగి భారీ స్కోరుకు బాటలు వేశారు. నబీ (14 నాటౌట్) పర్వాలేదనిపించాడు. ఉగాండా బౌలర్లలో కాస్మాస్ కెవుటా, మసాబాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేధనలో తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉగాండా ఆఫ్గన్ బౌలర్ల ధాటికి 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ ఒబుమా (14), రియాజత్ అలీ షా (11) మాత్రమే రెండెంకల స్కోరు చేయగా.. మిగతావారు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరుఖీ 5 వికెట్లతో చెలరేగగా.. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్లు చెరో 2 వికెట్లు తీశారు. ఉగాండా పతనాన్ని శాసించిన ఫరుఖీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు.
వర్షం అంతరాయం
బ్రిడ్జ్టౌన్: టీ20 ప్రపంచకప్లో రసవత్తర పోరు జరుగుతున్న సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలిపోరులో స్కాట్లాండ్పై గెలిచి ఘనంగా బోణీ కొడదామనుకుంటే వరుణుడు అడ్డుకున్నాడు. మెగాటోర్నీలో భాగంగా మంగళవారం గ్రూప్ భాగంగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ బ్యాటింగ్ ఏంచుకుంది. మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలే సమయానికి స్కాట్లాండ్ 6.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. విరా మం అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. స్కాట్లాండ్ ౧౦ ఓవర్లలో ౯౦ పరుగులు చేసింది.






