03-12-2025 11:30:29 AM
హైదరాబాద్: చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రుమాన్ రెస్టారెంట్(Rumaan Restaurant) ముందు ఆపి ఉంచిన ఆటోలో బుధవారం ఉదయం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక తనిఖీలు నిర్వహించారు. మృతులను జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారిగా తేల్చారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక దర్యాప్తులో, స్టెరాయిడ్ల అధిక మోతాదు కారణంగా ఇద్దరూ మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇద్దరు యువకులు ఇటీవల కొన్ని బాడీబిల్డింగ్ పదార్థాలను ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఘటనాస్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు, ఖాళీ సిరంజిలు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం నిర్ధారించబడుతుందని పోలీసులు పేర్కొన్నారు.