21-05-2025 01:17:43 AM
బావిలోంచి మోటార్ తీస్తుండగా ఘటన కామారెడ్డి జిల్లాలో విషాదం
నిజాంసాగర్, మే 20 (విజయ క్రాంతి), విద్యుత్ మోటార్ చెడిపోవడంతో బోర్ నుంచి బయటకు మరమ్మత్తుల కోసం తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు రైతులు దుర్మరణం చెందగా మరో రైతు గాయపడిన దుర్ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్ లో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది.
కంబపూర్ గ్రామానికి చెందిన రైతు ఆగ మప్పకు చెందిన వ్యవసాయ బోరు చెడిపోవడంతో మరమ్మతుల కోసం బోరు నుంచి మోటార్ ను తీసేందుకు గ్రామంలోని ఎర్ర హనుమయ్య, సంఘం రాములు అనే రైతులను బోరు తీయడానికి తీసుకెళ్లారు. మోటర్ తీసేందుకు ఇనుప పైపుతో పైకి లాగుతుండగా వారి పక్కనే విద్యుత్ లైన్ ఉండడంతో ఇనుప పైపు విద్యుత్తు లైనుకు తగిలి విద్యుత్ షాక్ వచ్చింది.
మరమ్మతుల కోసం బోరు లో ఉన్న మోటార్ను బయటకు తీస్తున్న సందర్భంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఎర్ర హనుమయ్య(55), సంగం రాములు(38) అనే రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగమప్ప అనే రైతుకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పిట్లం ఎస్త్స్ర అందుబాటులో లేకపోవడంతో నిజాం సాగర్ ఎస్ ఐ శివ కుమార్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
స్థానిక విద్యుత్ శాఖ అధికారులు చేరుకొని పంచనామ నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మోటార్ మరమ్మతు కోసం వచ్చి ఇనుప పైపు వాడడం వల్ల పక్కనే విద్యుత్ లైన్ వెళ్లడంతో విద్యుత్తు లైనుకు ఇనుప పైపు తగలడంతో విద్యుత్ షాక్ గురై నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన తో తీవ్ర విషాదం నెలకొంది.