28-05-2025 10:43:05 PM
మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించిన బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి...
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నక్సలైట్స్ అంటూ లేఖలు రాసి బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి(ACP Naresh Reddy) బుధవారం మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈనెల 22 వ తేదీన షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంటి వద్ద మేము నక్సలైట్లమంటూ, మాకు 50 లక్షలు కావాలని లేదంటే చంపేస్తామని ఒక లేఖ రాసి ఎరుపు రంగు టవల్ లో కారుపై పెట్టి వెళ్లారు. బాధితుడు రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను కనిపెట్టారు. A1 ఎర్రం శెట్టి రాజు(33), A2 కందురెల్లి రాజు(24) వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గన్నవరం ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వృత్తి రీత్యా నగరానికి వచ్చి షాపూర్ నగర్ లో నివాసముంటున్నారు. నిందితులు షాపూర్ నగర్ హెచ్ఎంటి జంగల్ లో దాగి ఉన్నారని విశ్వసనీయ సమాచారంతో బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో నక్సలైట్స్ అంటూ లేఖలు రాసి ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి కుట్ర పన్నారని తెలిపారు.
వీరి ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఇద్దరు నిందితులు షాపు నగర్ లోని ఒక సంపన్న నివాసిని లక్ష్యంగా చేసుకొని అతని ఇంట్లోనే కిరాయికి ఉంటూ అతనికే లేఖ రాసి 50 లక్షలు కావాలంటూ లేదంటే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుండి 13 నాటు బాంబులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులని రిమాండ్ కు తరలించామని ఏసీపీ తెలిపారు. ఈ కేసును త్వరగా పూర్తి చేసినందుకు జీడిమెట్ల ఎస్ హెచ్ ఓ జి మల్లేష్, డిఐ ఎస్. కనకయ్య, ఎస్సై ప్రేమ్ సాగర్, కానిస్టేబుల్స్ నరేష్, రవి నాయక్, వెంకటేష్ లను ఏసీపీ అభినందించారు.