28-05-2025 10:39:19 PM
మందమర్రి (విజయక్రాంతి): పాత్రికేయ రంగానికే కాకుండా సమాజానికి సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్(Senior journalist MD Muneer) లేని లోటు తీర్చలేనిదని ప్రెస్ క్లబ్ సభ్యులు, పలు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు, స్వచ్ఛంద, కుల, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ మృతికి సంతాపంగా పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్టణంలో భారీ కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని విటి అబ్రహం స్థూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... మునీర్ తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మునీర్ చిన్నతనం నుండే ఉద్యమ బాటలో పయనించి బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమించారన్నారు. చిన్ననాటి నుంచి భూస్వాముల దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న సమయంలో కార్మికుల పక్షాన ఉంటూ, కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పోరాటం చేశారన్నారు. నాలుగు దశాబ్దాలుగా సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఆయన పోరాడారని గుర్తు చేశారు.
సింగరేణి ప్రాంతంలో దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, ప్రజా సమస్యలు పరిష్కరించే వారు అని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 40వేల మంది గని కార్మికులను ఏకతాటిపై తీసుకువచ్చి, సింగరేణి జేఏసీ కన్వీనర్ గా సకలజనుల సమ్మె విజయవంతంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. చివరి వరకు పాత్రికేయుడిగానే కొనసాగుతూ, అనేక సామాజిక అంశాలను విశ్లేషిస్తూ, ప్రజాసేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు, ప్రజా, కుల, స్వచ్ఛంద సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.