28-05-2025 10:46:19 PM
మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి..
మందమర్రి (విజయక్రాంతి): రైతులు అధిక దిగుబడి కోసం మంచి నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి(Mandal Agriculture Officer Kiranmayi) తెలిపారు. బుధవారం ఆమె మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్తి విత్తన ప్యాకెట్లను, స్టార్ట్ రిజిస్టర్ను, రశీదు పుస్తకాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... పత్తి విత్తనాలు కొనుగోలు చేసే రైతులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
మంచి యాజమాన్య పద్ధతులలో నేల స్వభావం, నీటి వసతి, ఎరువుల వాడకం, చీడల నివారణ ముఖ్యమైనవని తెలిపారు. హైబ్రిడ్ విత్తనాలన్ని ఒకే తరహాలో దిగుబడులు ఇస్తాయని, వర్షాధార రైతులు మద్యస్థ కాయలు వచ్చే హైబ్రిడ్ విత్తనాలు వాడాలని, నీటి వసతి ఉన్న నల్ల భూముల్లో పెద్ద కాయలు వచ్చే హైబ్రిడ్ విత్తనాలు వాడాలని సూచించారు. ఒకే రకపు విత్తనాల కోసం రైతులు పోటీ పడవద్దన్నారు. విత్తనాల కొనుగోలు ముందు రైతులు తప్పనిసరిగా కొన్ని అంశాలు తెలుసుకోవాలని తెలిపారు. అధీకృత లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, పత్తి ప్యాకెట్ కు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, పంట కాలం వరకు ఆ బిల్లును భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.
రశీదులో కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్, ధర, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలన్నారు. విత్తనాల ప్యాకెట్ పై తయారు తేది, గడువు తేదీ, జీఈఏసి నెంబర్ ఉందా లేదా చూసుకోవాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు కొని, మోసపోవద్దని ఆ విత్తనాలకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు హైబ్రిడ్ పత్తి విత్తనాలను కలుషితం చేస్తాయన్నారు. తక్కువ ధరకు, ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మేవారి వివరాలు, పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన నకిలీ పత్తి విత్తనాల వివరాలు అధికారులకు తెలపాలని సూచించారు. అధికృత డీలర్ నుండి కాకుండా మిత్రుల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే మండల వ్యవసాయ అధికారిని గాని వ్యవసాయ విస్తరణ అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.