20 March, 2026 | 2:59 AM

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఆరంభం

20-03-2026 01:20 AM

వేములవాడ, మర్చి 19,(విజయక్రాంతి )రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి.గురువారం ఉదయం స్వస్తి పుణ్యావాచనం, రుత్విక్ వరణంతో ప్రారంభమైన కార్యక్రమాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక ఆర్చనలు చేశారు.

పరివార దేవతలకు కూడా పూజలు సమర్పించారు.శ్రీరామనవరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ రామాయణ పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్నాయి.భీమేశ్వరాలయం సమీపంలోని శంకరమఠంలో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు రామాయణ ప్రవచనాలు నిర్వహించబడనున్నాయి. భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్న ఈ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.ఆలయ అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా, ఆలయ ఈఓ రమాదేవి అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షించారు.