యూజీసీ నెట్ పరీక్ష రద్దు
పేపర్ లీకైనట్టు ఐసీసీసీసీ అనుమాలు
పరీక్షను రద్దుచేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 19: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగానే మరో పరీక్ష పేపర్ లీకైంది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీకైనట్టు అనుమానాలు రావటంతో పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. నీట్ పరీక్షను కూడా ఇదే సంస్థ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 9 లక్షల మంది అభ్యర్థులు మంగళవారం వివిధ సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష రాశారు. అయితే, ఈ పరీక్ష పేపర్ను సైబర్ నేరగాళ్లు తస్కరించినట్టు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనుమానాలు వ్యక్తంచేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖకు తెలిపింది. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు పరీక్షను రద్దుచేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.






