19-10-2025 12:51:32 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కులం పట్టింపు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కడుపులో బిడ్డను మోస్తున్నదని కూడా చూడకుండా కోడలిని ఓ మామ గొడ్డలితో నరికి చంపిన అమానవీయ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తన కొడుకు తమ కులానికి కాని అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహించలేక మామ ఈ దారుణానికి ఒడిగట్టాడు.వివరాల్లోకి వెళితే.. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన రాణి(23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వీరి వివాహం శేఖర్ తండ్రి సత్తయ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. కులాంతర వివాహం చేసుకోవడంపై కుమారుడిపై, కోడలిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఇదిలా ఉండగా, రాణి గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల నిండు గర్భిణి. త్వరలో తమ కుటుంబంలోకి కొత్త బిడ్డ రాబోతోందన్న ఆనందంలో శేఖర్, రాణి దంపతులు ఉన్నారు. వారి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయిన సత్తయ్య కిరాతకంగా ప్రవర్తించాడు.
గర్భిణి అని కూడా కనికరం లేకుండా ఆమె అమ్మగారి ఇంటిలో ఉన్న కోడలు రాణిపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సత్తయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.