19-05-2025 12:00:00 AM
కంట్లో కారం కొట్టిన అత్త, భార్య
మహబూబాబాద్, మే 18 (విజయ క్రాంతి): పుట్టింటికి వచ్చిన భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన అల్లుడిని మామ కత్తితో పొడిచి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో శనివారం జరిగింది. ధర్మారం తండా కు చెందిన బానోత్ వీరన్న కైలా దంపతుల కుమార్తె మౌనికతో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురుకల సోమారం గ్రామానికి చెందిన లకావత్ బాల (30) తో 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
బాల హైదారాబాద్ లోని లింగంపల్లిలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బాల మౌనిక దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే వారం రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడం తో మౌనిక తల్లి కైలా పుట్టినిల్లు ధర్మారం తండాకు తీసుకు వచ్చింది. దీనితో బాల తన భార్యను తిరిగి కాపురానికి తీసుకెళ్ళడానికి సోదరుడు భావ్ సింగ్ తో కలిసి బాల ధర్మారం తండాకు రాగా భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.
ఈ క్రమంలో బాల, బావ్ సింగ్ కంట్లో భార్య మౌనిక, అత్త కైలా కారం కొట్టగా, మంటలకు తాళలేక పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి ఆవరణలో నీళ్ల తొట్టిలో కడుక్కొని వస్తుండగా మామ వీరన్న కత్తితో అల్లుడు బాలను విచక్షణారహితంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన తండా వాసులు, సోదరుడు బావు సింగ్ 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాల మరణించాడు. అత్తింటివారు పథకం ప్రకారం తమపై దాడి చేసి, తన తమ్ముణ్ణి దారుణంగా హత్య చేశారని, మృతుడి సోదరుడు బావ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్ ఐ మురళీధర్ రాజ్ తెలిపారు.